కమకుర, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



’కమకుర’ నాకు జపాన్ లో చాలా బాగా నచ్చిన ప్రదేశం. కమకుర 800 సంవత్సరాల క్రితం జపాన్ కి రాజధానిగా ఉండేది, అదే సమయంలో ఇక్కడ ఎన్నో బౌద్ద, షింటో దేవాలయాలు కట్టడం జరిగింది. ఎన్నో గుడులకి, బీచ్ లకి ప్రఖ్యాతి చెందింది. టోక్యో నుండి ఒక గంటలో అక్కడికి చేరుకోవచ్చు.



మొదట మేము ’కెన్ చోజి’ అనే జెన్ బౌద్ద దేవాలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ లేరు. గిలిగింతలు పెడుతున్న చలి, సూర్యున్ని మింగేసిన మేఘాలు, చుట్టూ రకరకాల చెట్లు (ముందే చెప్పిన్నట్టు ఇక్కడి గుడులలో తోటలు చాలా అందంగా ఉంటాయి), చుట్టూ ఉన్న కొండలు, వాటి మీద దట్టంగా ఉన్న చెట్లు, అక్కడక్కడ ఉన్న గుడులు, లయబద్దంగా పక్షుల చేస్తున్న శబ్దం, వీటన్నిటితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా రోజుల తరువాత నగరానికి దూరంగా వచ్చినందుకు అనుకుంటాను ఆ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది. అంతా కలయతిరిగి వెళ్ళిపోయే సమయానికి జనాలు రావడం మొదలుపెట్టారు. ఆ తరువాత ’ఎన్ గకుజి’ దేవాలయానికి వెళ్ళాము, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ మంది ఉండే సరికి మొదటి ప్రదేశం అంత ప్రశాంతంగా లేదు, కాని తోటలు మాత్రం ఎప్పటిలా చాలా బాగున్నాయి.



కమకుర లో హైకింగ్ ట్రయల్స్ కూడా చాలా బాగుంటాయి. మేము గ్రేట్ బుద్ద విగ్రహాన్ని చేరే విధంగా మా హైకింగ్ కోర్స్ ని ఎంచుకున్నాము. చూడటానికి చిట్టడవిలా ఉండి ఎగుడుదిగుడు కొండలతో హైకింగ్ చాలా సరదాగా అనిపించింది. మధ్యలో ’జెనియరయి బెంతెన్’ గుడి కి వెళ్ళాము. జెనియరయి అంటే డబ్బులను కడగడం అని అర్ధం. డబ్బులను కడగడం ఏంటని అంటారా, ఇక్కడి గుడిలో ఒక చిన్న గుహ ఉంది, అందులో ఒక చిన్న నీటి ప్రవాహం ఉంటుంది, ఆ నీటి తో డబ్బులను కడిగితే అవి రెట్టింపు అవుతాయని వారి నమ్మకం (వెంటనే కాదండోయ్, కొన్ని రోజుల తరువాత !!). చాలా మంది డబ్బులను కడుగుతూ కనపడ్డారు, మేము కూడా మా అదృష్టాన్ని పరిక్షించుకున్నాము. కొందరైతే నోట్లను కూడా కడుగుతున్నారు, ఆ తరువాత బయట ఉన్న అగరుబత్తీల వేడిలో ఆరబెట్టుకున్నారు. ఇది గమనిస్తున్న కొందరు పాశ్చత్యులు "వీళ్లేంటి డబ్బులను తగలపెడుతున్నారు" అని జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి నమ్మకాలు వారివి.



తరువాత మళ్ళీ మా నడకను మొదలుపెట్టాము. దూరంగా కనపడే పసిఫిక్ మహాసముద్రం చూడడానికి ఎంతో బాగుంది. దాదాపు ఒక గంట నడక తరువాత ’గ్రేట్ బుద్ద’ విగ్రహం (డయిబుట్సు) కి చేరుకున్నాము. ఇది రాగితో చేసిన విగ్రహం. ఈ ప్రదేశంలో మొదట ఒక గుడి ఉండేది, కాని 15వ శతాబ్దంలో వచ్చిన సునామి వల్ల గుడి మొత్తం కొట్టుకుపోయి ఒక విగ్రహం మాత్రం మిగిలిఉంది. అలా అప్పటి నుండి ఆ విగ్రహం బయటే ఉండేసరికి ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. విగ్రహం క్రింద ఉన్న మెట్ల ద్వారా విగ్రహం లోపలికి వెళ్ళవచ్చు.




ఫోటో : గ్రేట్ బుద్ద పాదరక్షలు

డయిబుట్సు తరువాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న ’హసెదర’ అనే జొడొ బౌద్దమతానికి చెందిన గుడికి వెళ్ళాము. ఆ గుడిలో చెక్కతో చేయబడిన Kannon(god of mercy) పదకొండు తలల విగ్రహం ఉంది. ఇది జపాన్ లో చెక్కతో చేయబడిన విగ్రహాలలో పెద్దది. గుడిలో ఉన్న చిన్న చిన్న సరస్సులు తాబేళ్ళు, చేపలతో ఉండి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఆ గుడిలో ఉన్న ఒక గుహలో ఇంకా ఎన్నో విగ్రహాలను చూడవచ్చు. గుడి ప్రక్కనే చిన్న మ్యూజియం ఉంది. అందులో హిందూమతం నుండి బౌద్దమతం లోకి తీసుకోబడిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంద్ర, సూర్య, వరుణ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటి క్రింద జపనీస్ పేర్లు ఉండి దాని ప్రక్కనే సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. కమకురలో ఇంకా చాలా గుడులు ఉన్నాయి, కాని సమయాభావం వల్ల వెళ్ళడం కుదరలేదు.



చివరగా పసిఫిక్ మహాసముద్ర తీరానికి చేరుకున్నాము. పసిఫిక్ సముద్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది ప్రత్యక్షంగా చూడటం ఒక విధంగా సంతోషమేగా మరి.అతి పెద్దదైన మహా సముద్రం కాబట్టి చూడటానికి గంభీరంగా కనపడింది. సర్ఫింగ్, యాచింగ్ చేసే వాళ్ళు చాలా మంది కనపడ్డారు. అక్కడి బీచ్ లోనే సాయంత్రం వరకు గడిపి సూర్యాస్తమయాన్ని చూసి వెనుదిరిగాము.


నేను తీసిన ఫోటోలలో నాకు చాలా నచ్చిన ఫోటో

రోటీ, కపడా, మకాన్ ఔర్ ?  

Posted by ప్రపుల్ల చంద్ర in



ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెబుతారు ’రక్షణ’ అని, ఎందుకంటే అదికూడా ఒక ప్రాధమిక అవసరంగా మారింది. ఇంటి బయట అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు, వస్తామో లేదో అని. మొన్న జరిగిన హింసాకాండకి చలించని వారుండరు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగేసరికి దేశమంతటా భారీ స్పందన వచ్చింది, కాని ఇలాంటి సంఘటనలు దేశవిభజన నాటి నుండి కాశ్మీర్ లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు తెగబడి ఏ ప్రాంతం లో కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. భారతదేశంలోనే వారికి సహాయం దొరుకుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్ని పూర్వాపరాలు, అవి ఆపే ప్రయత్నం ఎలా చేయవచ్చో అన్న నా ఆలోచనలని పంచుకోవాలనే ప్రయత్నమే ఈ టపా.

కాశ్మీర్ వరకే ఉండే గొడవలు దేశం మొత్తం వ్యాపించడానికి కారణం బాబ్రి మసీద్ కూల్చివేత అని అనుకునే వాడిని, కాని తీవ్రవాదం మాత్రం అప్పటినుండే మొదలయ్యింది. ఇక గొడవల విషయానికి వస్తే ముస్లిం రాజులు 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మొదలయ్యింది. గుడులను ధ్వంసం చేయడం, మత మార్పిడులు చాలా జరిగాయి. అలా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లాస్ లోకి టీచర్ వచ్చాక అల్లరి చేసే పిల్లలు కాస్త నిశ్శబ్దంగా కూర్చునేటట్లుగా, ఆంగ్లేయులు వచ్చాక గొడవలు తగ్గించేసారు. మ్యూటిని అప్పుడు ఆంగ్లేయులు చిచ్చు పెట్టినా.... తరువాత అది సర్దుకుంది. సరైన ప్రాతినిధ్యం లేదని అలీజిన్నా లాంటి నాయకులు కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్రం రావడం, భారతందేశంలో ముస్లింలకు న్యాయం జరగదని వారు భావించి ప్రత్యేక దేశం కావాలని అడగడం జరిగింది, ఆ తరువాతి పరిస్థితులు ఎంతో రక్తపాతానికి తెరతీసింది. తరువాత కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఇక బాబ్రి మసీద్ విషయానికి వస్తే బాబర్ ఆ మసీద్ కట్టినప్పటి నుండి అది వివాదాస్పదమే. రామజన్మ భూమి పైన ఉన్న గుడిని కూల్చి, అక్కడ మసీద్ కట్టారని వాదన ఉంది (అలాంటిది ఏమీ లేదని ముస్లింల వాదన). మ్యూటిని ముందు వరకు హిందు, ముస్లిం లు అందరూ అక్కడ పూజలు జరిపేవారు. కాని మ్యూటిని గొడవల తరువాత హిందువులను అనుమతించలేదు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఆ మసీద్ ముందే చేసేవారు. ఆ మసీద్ యొక్క ఒక భాగం లో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించినా అధికారులు అనుమతించలేదు. తరువాత జరిగిన గొడవలలో కొద్దిగా కూలిపోతే ఆంగ్లేయులు కట్టించారు. స్వాతంత్రం తరువాత 1949 లో ఒకరాత్రి కాపలా పోలిసుల కన్నుగప్పి సీతారాముల విగ్రహాలని లోపల ప్రతిష్టించారు. తరువాత హిందూ భక్తులు మసీద్ లోపలికి రావాలని ప్రయత్నించడం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆ గుడిని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేసారు. 1984 నుండి అక్కడ గుడి కట్టాలని VHP, BJP లు గొడవలు చేయడం, కోర్టు ఆదేశాలని ప్రక్కన పెట్టి 1992 లో మసీద్ కూల్చడం జరిగింది. అది ఒక విధంగా మన రాజ్యాంగాన్ని మనమే వెక్కిరించినట్టు !!! నా ఉద్దేశ్యం ప్రకారం సరైన ఆధారాలు చూపి న్యాయపరంగా సాధించుకుంటే బాగుండేది. అది ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను!!! ఈ పని వల్ల సమస్య మరింత జటిలమైంది. మతవిద్వేషాలు రగిలి ఎన్నో గొడవలకి ఆజ్యం పోసింది. ముస్లింలలో అభద్రతాభావం పెంచింది. ఇది ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొట్టి వారి సహాయంతో చెలరేగిపోతున్నారు. రామజన్మభూమి దగ్గర జరిగిన త్రవ్వకాల ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అక్కడ రామాలయం ఉందనే ఆధారాలు ఎన్ని దొరికాయో, లేవని కూడా అన్నే దొరికాయి. అసలు సంగతి రామునికే తెలియాలి !!!

మరి ఇప్పుడు ఏం చేయాలి !!!!

ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తప్పులు ఇద్దరి వైపు జరిగిపోయాయి. అన్నింటికి అవతలి వారే కారణం అని చూపెట్టుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మానెయ్యాలి.

అయోధ్యలో రాముడి గుడి గురించి ప్రస్తావన తీసుకు రాకపోవడం చాలా మంచింది. ఒకవేళ పట్టుబట్టి కట్టినా ( ఒకవేళ అక్కడ గుడి ఉందని ఋజువైతే! ) గుడికి ఎమైనా జరిగితే గోద్రా కన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అనవసరంగా దేశంలో అస్థిరత వస్తుంది. అప్పుడు ఇంకెన్ని తీవ్రవాద సంస్థలు మొదలవుతాయో.

కాశ్మీర్ విషయానికి వస్తే అది ఇచ్చే సమస్యే లేదు. కాశ్మీర్ ఇచ్చినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు, ఇంకా పెరిగినా పెరగొచ్చు. అంతే కాక అక్కడ ఉన్న 30% హిందువుల గురించి కూడా ఆలోచించాలి ( కనీసం ఈ విషయం లో నైనా మనం అన్ని దేశాలలా ఆలోచించాలి ). పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అందరికి తెలిసిందే !!. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి కన్నా భారతదేశంలో ముస్లింల పరిస్థితి బాగుందని ఖచ్చితంగా చెప్పగలను. 1989 లో కాశ్మీరీ పండిట్లకి వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టారు, స్వాతంత్రం ఇస్తే ఇంకేం చేస్తారో.

భారతదేశం ఏర్పడినప్పటి నుండి లౌకిక రాజ్యం గా ఉంటున్నాం, అది అందరూ గౌరవించాలి. ప్రభుత్వం మాదే కదా అని ' రాముడే లేడు ' అనే కాంగ్రెస్ నాయకులకి, నోరుంది కదా అని 'రాముడు పెద్ద తాగుబోతు' అనే కరుణానిధి లాంటి నాయకులకి, మెజారిటీలము కదా అని ' బాబ్రి మసీద్ గతే మీకు పడుతుంది ' అని హెచ్చరించే (సామ్నా పత్రికలో) బాల్ థాకరే లాంటి నాయకులకి ప్రజలు బుద్ది చెప్పాలి.

మన దగ్గరి సమస్యలని కేవలం ప్రాంతీయ సమస్యలు గానే చూస్తుంన్నాము, దేశ సమస్యలు గా చూడటం లేదు. మొన్నటి వరకు కాశ్మీర్ తీవ్రవాదం కేవలం కాశ్మీర్ సమస్యగానే చూసాము, కాని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం వల్ల జాతీయ సమస్య గా పరిణమించింది. మొన్న ముంబయి దాడులు జరిగిన తరువాత రోజే అస్సాం లో రైలు లో బాంబు వల్ల ముగ్గురు చనిపోయారు, ఆ విషయం గురించి పెద్దగా స్పందనే రాలేదు. కాశ్మీర్ తీవ్రవాదం అయినా, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తీవ్రవాదమైనా, దండాకారణ్యంలో మావోయిస్టులనైనా, దేశ సమస్యకు కారణం ఎవరైనా మనందరం ఒక్కటిగా ఎదురుకోవాలి. జాతీయ సమైక్యతను పెంచాలి.

ఒకవైపు అందరం ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు మన ప్రియతమ కరుణానిధి గారు LTTE వాళ్ళని రక్షించే పనిలో ఉన్నారు. ఈ విధంగా మనది ద్వంద వైఖరి అని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నమాట. శ్రీలంక ప్రజలు 'వారికి వాళ్ళ సమస్యే తీర్చుకోవడం తెలియదు, మనది తీరుస్తారా' అని నవ్వుకుంటున్నారు. మన నాయకులకు ఎప్పుడు బుద్ది వస్తుందో!!!

కొందరు ముస్లింలకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటం వల్ల అందరు ముస్లింలు ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు. అందువల్ల కొందరు హిందువులు ముస్లింలను స్నేహితులుగా చేసుకోవడం లోను, ఇల్లు అద్దెకు ఇవ్వడం లాంటి విషయాలలోను ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి విషయాలలో మార్పు రావాలి.

ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా భారతీయ ముస్లింలు వేధింపులకు గురి అవుతున్నాం అని భాధ పడుతున్నారు. ప్రశ్నించబడేది కేవలం అనుమానితులే, అది కూడా నేర పరిశోధనలో భాగంగానే తప్ప ఇస్లాం మీద ద్వేషం తో కాదని ముస్లింలు గ్రహించాలి. దానికి కారణం కూడా కొందరు భారతీయ ముస్లింలు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడిన సందర్భాలు చాలా బయటపడ్డాయి కాబట్టి.

భారతదేశంలో ముస్లింలకి సరైనా ప్రాతినిధ్యం లేదా, ఆర్ధికంగా వెనక బడ్డారా? అని అడిగితే దానికి సమాధానం అవుననే వస్తుంది. సచార్ రిపోర్ట్ లో మనం పూర్తి గణాంకాలు చూడవచ్చు. ఆ రిపోర్ట్ దాకా ఎందుకు, మనం చదివిన ప్రదేశాలలో, ఉద్యోగం చేసే చోట చూస్తే మనకే తెలుస్తుంది... వారి ప్రాతినిధ్యం ఏంతో. వారి అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ముస్లింలే కాదు మన దేశంలో కోట్ల మంది హిందువులు కూడా కటిక పేదరికం లో ఉన్నారు. దాదాపు 30% (అంటే ఒక 30 కోట్లనుకోండి !!) మంది దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్లు మత ప్రాతిపదకన కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికి ఇవ్వాలనేదే చాలా మంది కోరిక. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ యొక్క అవసరం ఎంతైనా ఉంది. పేదరికంలో మగ్గుతున్న ఎందరో అమాయకులైన ముస్లిం యువకులను తీవ్రవాదులు తమ పావులుగా వాడుకుంటుంన్నారు, ఈ విషయం లో వారిని మరింత విజ్ఞానవంతులను చెయ్యాలి. మన దేశంలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

దేశవిభజన సందర్భంలో అక్షరాస్యులైన, ధనికులైనా ముస్లింలు చాలా మంది పాకిస్థాన్ కి వెళ్ళారు, అందువల్ల ముస్లింలలో పేదవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము ( ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ). మైనారిటీలం కాబట్టే మాకు సరైనా అవకాశాలు దొరకడం లేదు అనే భావన చాలా మంది లో ఉంది, కాని అది కేవలం రాజకీయనాయకులు సృష్టి మాత్రమే, రాజకీయాలు, ఆటలు, సినిమాలలో ( చెప్పాలంటే బాలివుడ్ మొత్తం వారిదే) ముస్లింలను ఎంతో మందిని చూడవచ్చు. ఇక అజారుద్దీన్ లాంటి వారు 'మైనారిటీలమనే మా మీద వివక్ష' అని నాటకాలాడటం, మతం అడ్డం పెట్టుకొని MIM వాళ్ళు రౌడీయిజం చేయడం లాంటి వాటి వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఈ విషయాన్ని కూడా ముస్లింలు గుర్తించాలి.

అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ లింక్ దొరికింది. హిందు-ముస్లిం వివాదాలతో పాటు కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విషయాలు అవును కదా అని అనిపించాయి. ఉదాహారణకి, పోలీసులు ఉద్యోగంలో చేరక ముందు నుండి ఉన్న నమ్మకాలని (దేవుడు, మతం....) వారు మార్చుకోరు. అందువల్ల హిందు-ముస్లిం గొడవలు జరిగేప్పుడు పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో సంస్కరణలు అవసరం. ఇదే ప్రశ్న పోలీసులని అడిగితే గొడవలు జరిగేప్పుడు ఎవరు aggressive గా ఉంటే వారిని control చేయడానికి ప్రయత్నిస్తాం అంటారు.

పరిస్థితులన్ని చక్కబడి అందరూ ఒక కుటుంబంలా ఉండాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు !!!

ఫుజి పర్వతారోహణం - 4 (చివరి భాగం)  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



శిఖరం మీద ముఖ్యంగా చూడవలసినది crator, అక్కడి నుండే లావా వెదజల్లింది. అది చాలా లోతుగా ఉంది !!!. 300 సంవత్సరాల క్రితం లావా అక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు అంతా ఏదో తెలుపు రంగులో ఉంది.



ఫుజి పర్వతం నేషనల్ పార్క్ గా గుర్తించబడినది, కాబట్టి ఎక్కడ కూడా టెంట్ వేసుకోకూడదు. కొద్ది సేపటి తరువాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. అంతా మట్టి మట్టిగా ( లావా బూడిదలా ) ఉంది. మట్టి అయ్యేసరికి జారుతూ ఉంది. అలా అయితే కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చు. పాము మెలికలలా ఉంది దారి అంతా. నడుస్తూ ఉంటే దుమ్ముంతా పైకి లేస్తూ ఉంది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము.



నడిచివస్తూ ఉంటే ఒక గమ్మత్తైన దృశ్యం కనపడింది, మేఘాలు క్రింది నుండి పైకి వెళ్తున్నాయి, అవి పర్వతం ఎక్కుతున్నట్టుగా అనిపించింది.



తిరుగుప్రయాణం కూడా చాలా సేపు అనిపించింది. అలా మొత్తానికి మా ఫుజి యాత్ర ముగించాము. మొదటి టపాలో చెప్పినట్టు 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని ఎందుకో అర్ధం అయ్యింది. ఇక్కడి కవులు ఫుజిపర్వతం గురించి ఇలా అంటారు, " కొన్నింటి అందాన్ని దూరం నుండి చూసి ఆనందించాలి, దగ్గరకి వెళ్ళి చూడలనుకోకూడదు". ఎందుకంటే ’ఫుజి’ దూరం నుండి చూస్తే చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళితే అంతా బూడిద, మట్టి, దుమ్ము.
కాని ఇప్పటికీ ’ఫుజి’ ఎప్పుడు గుర్తు వచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది, అది ఎప్పటికీ మరిచిపోలేని యాత్ర !!!

చిత్రాలపై క్లిక్ చేస్తే మంచిగా చూడవచ్చు...

ఫుజి పర్వతారోహణం - 3 ( మేఘాలలో..... )  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

అలా 3.30 గంటల నుండి సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాము. చలి కూడా చాలా ఉంది. అప్పటికే మా వాళ్ళు చాలా అలసిపోయి నిద్రపోవడం మొదలుపెట్టారు. నేను మాత్రం కెమరా పట్టుకొని ఎదురుచూస్తూ కూర్చున్నాను. నెమ్మదిగా ఆకాశం ఎర్రగా అవుతూ, కొద్ది కొద్దిగా క్రింద ఉన్న మేఘాలు మంచిగా కనపడుతూ వచ్చాయి. అంత ఎత్తులో, ప్రపంచంలో మొదటి సూర్యోదయాన్నిచూడటం మాత్రం ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. అక్కడ నేను, నా మిత్రులు తీసిన ఫోటోలు చూడండి.











చుట్టూ మేఘాలు మధ్యలో మేము, మేఘాలు పరుపులలా మొత్తం పరుచుకొని ఉన్నాయి. చిన్నప్పుడు మేఘాలు పరుపులలా ఉంటాయి, వాటి మీద నడవవచ్చు అని అనుకునేవాడిని. అలాగే ఉంటే ఎంచక్కా సూర్యుడి వరకు నడుస్తూ వెళ్ళొచ్చు కదా !!!.



అలా తనివితీరా చూసిన తరువాత శిఖరాన్ని చేరడానికి మళ్ళీ మా నడక మొదలుపెట్టాము. జనాభా కూడా అంతకు అంత పెరిగిపోయింది. మళ్ళీ రాత్రి లా తయారయ్యింది పరిస్థితి, రెండడుగులు వెయ్యడం నిమిషం ఆగిపోవడం. కొందరు ఆక్సిజన్ సరిప్పోక అవస్థలు పడుతూ కనపడ్డారు, ఆక్సిజన్ బాటిల్స్ తో పఫ్ తీసుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం. మొత్తానికి 20 నిముషాలు ఎక్కవలసింది 2 గంటలు పట్టింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మధ్యలో తప్పిపోయిందనుకున్న అమ్మాయి ’స్వాతి’ మా కన్నా ముందే శిఖరానికి చేరుకొని మా కోసం ఎదురుచూస్తూ ఉంది!!!.



మొత్తానికి విజయవంతంగా పర్వతారోహణాన్ని ముగించాము. పైనే కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. శిఖరం మీద ఒక తోరి ఉంది ( మనభాషలో చెప్పాలంటే తోరణం ).
మిగతా విశేషాలు వచ్చే టపాలో.

ఫుజి పర్వతారోహణం - 2  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

మొదటిభాగం.... తరువాత

మా దగ్గరి నుండి ఒక రెండు గంటల ప్రయాణం తరువాత మధ్యాహ్నం 3:30 గంటలకు ’కవగుచికొ’ చేరుకున్నాము. అక్కడి నుండి ఫుజి 5వ స్టేషన్ కి బస్సులు ఉంటాయి. ఆ రోజు చాలా వేడి గా ఉంది. అక్కడి నుండి బస్సు ప్రయాణం చాలా బాగుంది. ఒక అడవిలా ఉంది అంతా, చుట్టూ చెట్లు, మధ్యలో నుండి వెళ్ళే ఘాట్ రోడ్డు చాలా బాగుంది. బస్సు అక్కడి నుండి 2300 మీటర్ల ఎత్తులో ఉన్న 5వ స్టేషన్ కి చేరుకుంది. అక్కడ కొద్దిగా చల్లగా ఉంది.



జపాన్ లో మేము ఒక 8 మంది బ్యాచ్, ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసే ఉంటాము. మాతో పాటు మా కొలీగ్ స్వాతి అనే అమ్మాయి కూడా వచ్చింది. అలా 9 మందిమి ఒక గంట ఫోటో సెషన్ అయ్యాక, కొద్దిగా ఫలహరం తిన్నాము. అక్కడి నుండి ఫుజి చిన్నగా అనిపించింది, మరి 2300 మీటర్ల ఎత్తులో ఉన్నాము కదా!. క్రింద కనపడుతున్న మేఘాలను చూసి మేమే పైన వున్నాం అంటూ వెక్కిరిస్తుంటే, ఇంకా పైన ఉన్న మేఘాలు ’మీకంత సీన్ లేదమ్మా’ అన్నాయి, వాటి సంగతి కూడా చెబుతామని పర్వతారోహణం మొదలు పెట్టాము. అలా సాయంత్రం 6 గంటలకి మా ప్రయాణం మొదలు పెట్టాము. పైకి వెళ్ళడానికి 6-8 గంటలు పడుతుంది, సూర్యోదయం ఇంకా 10 గంటలు ఉంది కాబట్టి నెమ్మదిగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలని నిశ్చయించుకున్నాము.



ఇలాంటి ప్రయాణాలలో మంచి జట్టు ఉండాలి. ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతుడిని, ఒకరికోసం ఒకరం ఆగుతూ, అక్కడక్కడా సేద తీరుతూ, కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా ఎక్కాము. మొదట్లో కొద్దిగా వాలుగా ఉండి మామూలు మట్టి ఉంది, ఎక్కడం కొద్దిగా సుళువుగా అనిపించింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు అయ్యేసరికి మెదడుకి తప్ప శరీరానికి పెద్దగా పనిలేకుండా పోయింది, కొద్దిసేపటికే అలుపు వచ్చేసింది :( ( కొద్ది రోజుల ముందే క్రికెట్, ఈత మొదలు పెట్టామనుకోండి అది వేరే విషయం, లేకపోతే ఒక్కసారే మహాపర్వతం ఎక్కడం కష్టం అని). కొద్ది దూరం వరకు మెట్లు ఉండి ప్రక్కన చిన్న గోడలాగా ఆధారం ఉంది. చందమామ కూడా మాతోపాటే ఉన్నాడు మమ్మల్ని గమనిస్తూ !! ( ఆ రోజు వ్యాసపూర్ణిమ తరువాతి రోజు ).



మధ్య మధ్య లో జపనీయులు ’గంబత్తె కుడసయి’ ( keep your chin up, do well ) అంటూ ప్రోత్సహిస్తూ ఉన్నారు, మేమూ వాళ్ళకి చెప్పామనుకోండి. నాకు జపనీయులలో చాలా నచ్చే విషయం, తెలియని వారిని కూడా ఎప్పుడూ నవ్వుతూ పలకరించడం. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. భారతీయులు చాలా మంది వచ్చారు.

వీడియో గేమ్ లో లెవెల్ పెరిగినట్టుగా మాములు దారి అయిపోయి లావా గడ్డకట్టి ఉన్న ఎగుడుదిగుడు దారి వచ్చింది. అక్కడ కొద్దిగా కుస్తీ పడాల్సి వచ్చింది. చల్లదనం కూడా పెరుగుతూ వచ్చింది. గ్లోవ్స్, జర్కిన్ లు వేసుకున్నాము. అలుపు తగ్గడానికి పాటలు పాడుతూ వెళ్ళాము, జపాన్ వాళ్ళు కూడా బానే విన్నారు ( భరించారు !!! ) మా పాటలు.



అలా అలా 10.30 గంటలకి 8వ స్టేషన్ కి చేరుకున్నాము. అక్కడి నుండి శిఖరం చేరడానికి ఇంకో రెండు, మూడు గంటలు తీసుకుంటుందని చెప్పారు. అంత తొందరగా పైకి వెళితే అక్కడ చలికి తట్టుకోవడం కష్టం అని ఉన్న 8వ స్టేషన్ (హట్) దగ్గరే కొంత సేపు ఉండి వెళ్ళాలని అనుకున్నాము. అక్కడే వెన్నెల్లో, 3300 మీటర్ల ఎత్తులో, మేము తెచ్చుకున్న భోజనం తిన్నాము ( moon light dinner :) ). అదో గొప్ప అనుభవం. అక్కడ నుండి క్రిందకు చూస్తే మాత్రం చాలా భయానకంగా ఉంది. అక్కడే చాలా సేపు గడిపి (ఒక కునుకు తీసి) మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాము.

చలి తీవ్రత పెరుగుతూ వెళ్ళింది, చలితో పాటు ఉదృతంగా గాలి కూడా ఉంది. తెచ్చుకున్న ఊలు టోపి చలిని ఆపలేకపోయింది, కొద్దిగా తలనొప్పి మొదలయ్యింది. లాభం లేదని ముఖానికి కర్చీఫ్, చెవులను కప్పుతూ టవల్ కట్టుకున్నాను. చూడడానికి ఒక మిలిటెంట్ లా తయారయ్యాను. ఎక్కుతూ ఉంటే శక్తి కూడా తగ్గుతూ వచ్చింది. 3350 మీటర్ల ఎత్తు వెళ్ళిన తరువాత మా స్నేహితుడికి వాతావరణం పడలేదు, పాపం అక్కడే ఆగిపోయాడు. కొద్దిగా భాదగా అనిపించింది, కాని అంత దూరం వెళ్ళాం అని మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టాము. జనాభా కూడా చాలా పెరిగిపోయింది. నెమ్మదిగా నడవాల్సి వచ్చింది. అక్కడ ఒక western ఆవిడ కనపడింది చిన్న షార్ట్, పలుచని టి-షర్ట్ వేసుకొని !!, మేము కళ్ళు తప్ప శరీరంలో అన్ని భాగాలు కప్పేసుకున్నా, మాకు చాలా చలిగా ఉంది. ఆమె మాత్రం చాలా తాపీగా నడుస్తోంది.



ఒకానొక సమయం లో గాలి ఎంత పెరిగిపోయిందంటే, ఆ గాలికి క్రింద పడిపోతామా అనిపించింది, క్రింద మట్టి కూడా జారుతోంది. ప్రక్కన చూస్తే పెద్ద లోయలా ఉంది. కొద్దిగా భయం వేసింది !!! అలా 3450 మీటర్ల ఎత్తు ఎక్కేసరికి 2.30 అయ్యింది. అంత మంది ఉన్నా మేము 8 మంది ఒకరికోసం ఒకరు ఆగుతూ దాదాపు గుంపుగానే వెళ్ళాము. 3.30 అయ్యేలోపు పైకి వెళ్ళాలని మా వాళ్లని తొందరపెట్టడం మొదలుపెట్టాను. ఒక్కచోట కూడా విశ్రాంతి తీసుకోలేదు నేను. అలా వెళ్ళడం చాలా కష్టం అయ్యింది. ఒక సమయం లో నాకు మా వాళ్ళు ఎవరూ కనపడలేదు, క్రింద ఇసుక మరీ జారుతూ ఉంది, దానికి తోడు గాలి. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. ఇలా అయితే శిఖరం చేరడం కష్టం అనుకొని, ఒక ప్రక్కన కూర్చొని, బ్యాగ్ లో నుండి చాక్లెట్ తీసి, తిని, కొద్దిగా నీళ్ళు త్రాగి ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను. తరువాత మళ్ళీ నడక మొదలు పెట్టాను, కొద్ది దూరంలోనే మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. హమ్మయ్యా అనుకున్నాను. కాని మాతో వచ్చిన అమ్మాయి మాత్రం ఎంత సేపు ఎదురుచూసినా కనపడలేదు. అంతకు ముందే ’నా వల్ల కాదు, ఆగిపోతాను’ అంది, అలాగే ఆగిపోయి మా స్నేహితుడి (మధ్యలో ఆగిపోయిన స్నేహితుడు) దగ్గరికి వెళ్ళిపోయుంటుందని మేము మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టాము. కాని చాలా మంది ఉండే సరికి ఒక అడుగు వేస్తే మళ్ళీ ఇంకో అడుగుకోసం రెండు నిముషాలు ఆగాల్సి వస్తూ వచ్చింది, నాకు తిరుపతిలో ఉన్నట్టుగా అనిపించింది. అలా కష్టపడి 3700 మీటర్ల ఎత్తు ఎక్కేసరికి 3.30 అయ్యింది, ఇంకో 76 మీటర్లు ఎక్కితే శిఖరం చేరుకోవచ్చు, కాని అక్కడ పరిస్థితి చూస్తే ఒక 2 గంటలు పట్టేట్టుంది. ఇలా అయితే సూర్యోదయం సరిగ్గా చూడలేము అనుకొని, అక్కడే ఒక మంచి ప్రదేశం చూసుకొని కూర్చున్నాము.

సూర్యోదయం, శిఖరం విశేషాలు వచ్చే టపాలు.....

ఫుజి పర్వతారోహణం - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



చూడడానికి చాలా అందంగా ఉంది కదా, మంచు టోపీ పెట్టుకొని !! బొమ్మలలో గీసినట్టుగా, పర్వతం అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది ఫుజి పర్వతం. వాతావరణం మంచిగా ఉన్నప్పుడు టొక్యొ నుండే కనపడుతుంది. జపాన్ లోనే ఎత్తైన పర్వతం కాబట్టి చాలా గంభీరంగా, హుందాగా కనపడుతుంది !!!. జపాన్ కి వెళ్ళినప్పడి నుండి ఫుజి పర్వతం ఎక్కాలని చాలా కోరికగా ఉండేది. కాకపోతే ఎక్కడానికి అనుమతి కేవలం వేసవి కాలంలోనే ( జూలై, ఆగష్ట్ నెలల్లో ) ఉంటుంది. నేను వెళ్ళేప్పటికే వేసవి అయిపోయింది. వేసవిలో తప్ప మిగతా కాలం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి తరువాతి వేసవి వరకు వేచి చూడాల్సి వచ్చింది.

ఫుజి పర్వతాన్ని జపాన్ వాళ్ళు ’ఫుజియమ’ లేక ’ఫుజిసాన్’ అని పిలుస్తారు. మనకు తాజ్ మహల్ లా జపాన్ వారి గుర్తుగా ఫుజి పర్వతాన్ని ఉపయోగిస్తారు ( symbol to represent Japan). వీరి కళలలో ( చిత్రలేఖనం, సాహిత్యం లలో ) ఫుజి చాలా కనపడుతుంది. ఫుజి 3776 మీటర్ల (12388 ft) ఎత్తైన పర్వతం, అంటే దాదాపు ఎవరెస్ట్ లో మూడో వంతన్నమాట. సంవత్సరానికి ఒక 2 లక్షల మంది వరకు ఫుజి పర్వతారోహణ చేస్తారు. అందులో 30 శాతం వరకు విదేశీయులే ఉంటారు. ప్రపంచంలో ఎక్కువమంది పర్వతారోహణ చేసేది ఇదేనేమో !!. ఇంకొక విశేషమేమిటంటే ఇది ఇంకా క్రియాశీలకం (active) గా ఉన్న అగ్నిపర్వతం. కాకాపోతే ఇంకో 200, 300 సంవత్సరాల వరకు బద్దలయ్యే అవకాశం లేదట. చివరిసారి 300 వందల సంవత్సరాల క్రితం లావా వెదజల్లింది. కొన్ని వేల సంవత్సరాలుగా మారుతూ మారుతూ ఇప్పుడు ఉన్న రూపానికి వచ్చిందట. ఫుజి పర్వతం చాలా అద్భుతంగా సమవిభక్తం (symmetrical) గా శంఖువు ఆకారంలో ఉంటుంది, అగ్నిపర్వతం అయ్యేసరికి అలా ఉందేమో, కాని అలా ఉండటం చాలా అరుదు. విమానం నుండి తీసిన ఈ ఫోటో చూడండి, మేఘాలు దూదిపింజల్లా ఫుజి పర్వతం చుట్టూ చేరాయి.



సాధారణంగా సూర్యోదయం చూసే విధంగా ( ఆ సమయానికల్లా శిఖరాన్ని చేరే విధంగా ) పర్వతారోహణం మొదలు పెడతారు. కాబట్టి సాయంత్రం బయలుదేరుతారు. ఫుజి ఎక్కడానికి 4 దారులు ఉన్నాయి. ’కవగుచికొ’ నుండి వెళ్ళే దారి చాలా ప్రాచూర్యమైనది. క్రింది నుండి ఒక్కో స్టేషన్ ఉంటుంది. మొదటి స్టేషన్ నుండి దాదాపు ఎవరూ నడక మొదలుపెట్టరు, సాధారణంగా అందరూ 5 వ స్టేషన్ నుండి ఎక్కడం మొదలుపెడతారు (అక్కడ పార్కింగ్ కోసం చాలా స్థలం ఉంటుంది). కేవలం 5 వ స్టేషన్ వరకే రోడ్డు ఉంటుంది, తరువాత అంతా కాలి నడకే. ఇది 2300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 1500 మీటర్లే ఎక్కుతారు ( cheating... cheating.. అంటారా !!!, ఏం చేస్తాం అందరూ అలానే ఎక్కుతారు). అక్కడి నుండి శిఖరాన్ని చేరుకోడానికి దాదాపు 6-8 గంటలు పడుతుంది.

అగ్నిపర్వతం కాబట్టి మట్టి ( చిన్న చిన్న రాళ్ళతో ), అక్కడక్కడ బూడిద, గడ్డకట్టిన లావా వల్ల ఎగుడు దిగుడు (uneven) గా ఉండి ఎక్కడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. పైకి వెళ్తున్నాకొద్ది చల్లదనం పెరుగుతూ ఉంటుంది. ఆక్సీజన్ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది ( ఇవి ఎక్కడైనా అంతే కదా అంటారా !!, సాధారణంగా ఇంతా పెద్ద పర్వతాలు ఎక్కం కాబట్టి ప్రత్యేకంగా, ముందు జాగ్రత్తగా చెబుతున్నానంతే ). శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఆక్సీజన్ డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది. ఎత్తులు పడనివారు (altitude sickness ఉన్నవారు) కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పీడనం (pressure) లో తేడాల వలన తల నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. రాత్రి గనక ఎక్కితే టార్చ్ లైట్లు పట్టుకెళ్ళడం మంచింది, దారిలో ఎక్కడా లైట్లు ఉండవు. పైన చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండే బట్టలు వేసుకెళ్ళాలి. జపాన్ లో వేసవి చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి ఆ బట్టలు పర్వతం క్రింద ఉన్నప్పుడు వేసుకోవడం కష్టం. మొత్తానికి బట్టలు, తినే పదార్ధాలు ( జపాన్ ఆహరం తినే వారికి సమస్య ఉండదనుకోండి అది వేరే విషయం), ఇలా సరంజామా చాలానే తీసుకువెళ్ళాలి. దారి మధ్యలో అక్కడక్కడ హట్ లు ఉంటాయి, అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవచ్చు, తినడానికి పదార్ధాలు కూడా దొరుకుతాయి.

జపాన్ వారు ఫుజి పర్వతాన్ని చాలా గౌరవిస్తారు (అసలే ప్రకృతి ఆరాధకులు కదా !). వీరికి ఫుజి పర్వతం ఎక్కాము అని చెబితే ’ఆఆఆఁ..... ’ అని ఆశ్చర్యపడతారు. ఎవరెస్ట్ ఎక్కామని చెప్పినా అంత ఆశ్చర్యపడరేమో!. జపాన్ వారి ఒక నానుడి ఉంది, 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని, అది ఎందుకని చివర్లో తెలుస్తుంది లేండి. ఫుజి పర్వతం అందంగా చూడటానికి 36 వేర్వేరు విధాలుగా ( వివిధ ప్రదేశాల నుండి వివిధ వాతావరణాలలో ) ఎలా చూడాలని ఇక్కడ ఉంది చూడగలరు. క్రింది రెండు ఫోటోలు జపాన్ లో చాలా చోట్ల చూడవచ్చు. మొదటిది వసంతకాలంలో ఫుజి పర్వతానికి సమాంతరంగా వెళ్తున్న బుల్లెట్ ట్రైన్. రెండవది ఒక పెద్ద సముద్రపు అల వెనకాల దూరంగా, చిన్నగా కనపడే ఫుజి పర్వతం, దీన్ని the great wave off kanagawa అంటారు.





ఎక్కేముందు ముందుగా చూసుకోవలసిన ముఖ్య విషయం వాతావరణం. అక్కడ చాలా తొందరగా వాతావరణం లో మార్పులు వస్తాయి. కాబట్టి ముందుగా ఊహించడం కొద్దిగా కష్టమే. ఆకాశం నిర్మలంగా ఉంటేనే వెళ్ళడం మంచిది, మంచు ( మేఘాలు అనాలేమో !!) ఉంటే చాలా కష్టం, సూర్యోదయం కాదు కదా ప్రక్కన ఉన్న మనిషి కూడా కనపడడు. అంత కష్టపడి ఎక్కిన తరువాత అలా జరిగితే చాలా భాధ పడాల్సివస్తుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు, చలి చంపేస్తుంది, తల దాచుకోవడానికి ఏమి ఉండవు. రెండు సంవత్సరాల క్రితం వాతావరణం అంతా మంచిగా చూసుకొని మా కొలీగ్స్ వెళ్తే, అనుకోకుండా వర్షం పడి చాలా అవస్థలు పడ్డారట.
మొత్తానికి మేము కూడా అన్నీ చూసుకొని జూలై 19 రోజు వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఆ యాత్రా విశేషాలు వచ్చే టపాలో.

మొదటి రెండు ఫోటోలు flicker నుండి, తరువాత రెండు వికీ నుండి తీసుకున్నవి.

జపాన్ విశేషాలు - 10 (చివరి భాగం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ లో రైల్వే వ్యవస్థ చాలా పద్దతిగా ఉంటుంది, టోక్యోలో ఎక్కడి నుండైనా ఐదు నిమిషాలు నడిస్తే ఏదో ఒక స్టేషన్ ఉంటుంది. రైళ్ళ, బస్సుల అనుసంధానం కూడా చాలా బాగుంటుంది. దాదాపుగా అందరూ రైళ్లల్లో ప్రయాణిస్తారు. ఇక్కడ రైళ్ళో ఏ వస్తువు కూడా పోదు అని పేరు ఉంది, అంటే పోగొట్టుకున్నా తప్పకుండా దొరుకుతుంది !!!. రైళ్ల సమయపాలన కూడా చాలా బాగుంటుంది. ఉదాహారణకి 10.36 గంటలకి రైలు ఉందనుకోండి, ఖచ్చితంగా అదే సమయానికి వస్తుంది, లేకపోతే మన గడియారాలు సరి చేసుకోవాలి అంటే అతిశయోక్తి కాదేమో. ప్లాట్ ఫాం పై ఎక్కడ తలుపులు ఉంటాయో, ఎక్కడ నిలబడాలో గీసి ఉంటుంది, సరిగ్గా రైలు కూడా అక్కడే ఆగుతుంది. అయస్కాంత శక్తితో వెళ్ళే రైలు, బుల్లెట్ ట్రైన్ ( జపాన్ లో షిన్ కన్ సెన్ అని పిలుస్తారు) 581 kmph వేగంతో వెళ్తుంది. అది ప్రపంచంలోనే అత్యంత వేగమైనది. కాకాపోతే ఇది పరీక్షా సమయంలో మాత్రమే, అది ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇంకో 15 సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడు ఉన్న బుల్లెట్ ట్రైన్ లు సాధారణంగా 300 kmph వేగం తో వెళ్తాయి. ఒకసారి నేను అందులో ప్రయాణించాను, అదొక ప్రత్యేకమైన అనుభవం.




ఫోటో : టికెట్లు తీసుకునే కౌంటర్, టికెట్లను గుర్తించి లోపలికి అనుమతించే యంత్రాలు. దాదాపుగా అన్నీ స్వయం చాలితాలే (automatic), టికెట్ కండక్టర్, టికెట్ ఇచ్చేవారు ఉండరు.

ఇక్కడ బయటికి ఎప్పుడు వెళ్లినా ఏదో ఒక వింత చూస్తూనే ఉంటాము. వీరి సాంకేతికత చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఒకతను ఒక ట్రాలీ లో వస్తువులు పట్టుకొని మెట్ల వైపు వచ్చాడు. ఇదేంటి ఇంత సామానుతో ఇలా వస్తుంన్నాడు, మెట్లు ఎక్కడం కష్టం కదా అనుకున్నాను. ఆ ట్రాలీ మెట్లు ఎక్కేస్తుంది దానికి ఉన్న చక్రాలతో !!!!. ఇలా చాలానే ఉన్నాయి.

జపాన్ లో ఎక్కువగా ఆడే ఆట బేస్ బాల్. ఈత రాని వారు కూడా దాదాపు ఎవరూ ఉండరు.

ఇక్కడ పోలీస్ స్టేషన్లు నాకు ఎప్పుడూ కనపడలేదు. కాకాపోతే పోలీస్ బాక్స్ లు ఉంటాయి. చిన్న గదిలా ఉండి ఒకరు కూర్చోడానికి వీలుగా ఉంటుంది, కొంత ఆఫీస్ సామగ్రి కూడా ఉంటుంది. దాదాపు వారికి పెద్దగా పని కూడా ఉండదు. వారు ఉపయోగించే స్కూటర్ పిజ్జాహట్ వారు ఉపయోగించే స్కూటర్ లా ఉంటుంది, కేవలం వెనక రాసి ఉండే 'POLICE' ని చూసి మాత్రం తేడాని గుర్తించగలం. ఎప్పుడూ ఏ గొడవాలేకుండా ఉంటుంది కాబట్టి దాదాపు వీరి అవసరం ఉండదు అప్పుడప్పుడు తప్ప. చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ కూడా 'యకుజ' అనే మాఫియా ఉంది. ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద మాఫియాలలో ఇదీ ఒకటి.

ఎక్కువగా బ్లాగుల్లో వ్రాయబడే భాష జపాన్ భాషే (ఆంగ్లం, చైనా భాషల కన్నా కూడా !!!! ) . పోయిన సంవత్సరం చేసిన లెక్కల్లో జపాన్ బ్లాగుల్లో మొదటి స్థానంలో ఉంది.



దేవాలయాల గురించి వ్రాసిన టపాలో చెప్పినట్టు వీరి తోటల పెంపకం చాలా బాగుంటుంది. 'బొన్ సయి' (జపాన్ భాషలో, తొట్లలో చెట్లు పెంచడం ) తరహా చెట్ల పెంపకం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచూర్యం పొందింది. చైనా నుండి ఈ పద్దతిని తీసుకున్నారు. ఈ పద్దతిలో చెట్లను కొన్ని సంవత్సరాలపాటు తొట్ల లోనే పెంచుతారు. చిన్న మహా వృక్షాలలా కనపడే ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని చెట్లు 800 సంవత్సరాల వయసు ఉన్నవి కూడా ఉన్నాయి.



'ఇకెబన' అనే పుష్పాలంకరణ పద్దతి కూడా జపాన్ వారి సాంప్రదాయంగా వస్తున్న కళ. ప్రకృతి, మనుషుల సంబంధాన్ని తెలిపేట్టుగా ఈ అలంకరణ ఉంటుంది.

ఇంకా జపాన్ ప్రసిద్ది చెందిన విషయాలు చాలా ఉన్నాయి, హైకు, సమురయి, నింజా, గీషా ఇలా చాలా ఉన్నాయి, కాకపోతే వాటి గురించి నాకు అంతగా తెలియదు. వికి లింకులు ఇచ్చాను ఆసక్తి ఉన్నవారు చదవగలరు.

ఈ టపా జపాన్ విశేషాల పరంపరలో చివరిది (ఇంకా వ్రాద్దామనుకున్నా, కాని నాకు తెలిసిన విశేషాలు అయిపోయాయి :( ). ఇక్కడ చూసిన చాలా ప్రదేశాల గురించి ట్రావెలాగ్ వ్రాయడం మొదలు పెట్టాలి.

ఈ విశేషాలు వ్రాయడం లో సహకరించిన నా కొలీగ్ చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే ఈ టపాలు చదివి ఇంకా వ్రాయడానికి ప్రోత్సహించినవారికి కూడా నెనర్లు.

జపాన్ విశేషాలు - 9 ( ముఖ్యమైన మాటలు )  

Posted by ప్రపుల్ల చంద్ర in

 నా ముందు టపాలో cbrao గారు కొన్ని ముఖ్యమైన జపనీస్ మాటలు, వాటి అర్ధాలు వ్రాయమన్నారు. భాష గురించి రాసిన తరువాత వ్రాద్దామనుకొని ఇప్పుడు వ్రాస్తున్నాను. ఈ అర్ధాలు కేవలం ఆ context లోనే ఉపయోగిస్తారని గమనించగలరు, అసలు అర్ధాలు కొద్దిగా వేరుగా ఉంటాయి.

హజిమెమషితె - Nice to meet you

ఒనమ ఎ వ? - (Your) name ?

ఒగెంకి దేసు కా ? - How are you ? (బాగున్నారా ?)

హయ్, గెంకి దెసు - Yes, I am fine

దైజోబు - OK

ఒహాయో గొజాయిమసు - Good morning

కొన్నిచివా - Hello
(ప్రొద్దున 10 గంటల నుండి సాయంత్రం వరకు సాధారణంగా ఉపయోగించే పలకరింపు)

కొంబావా - Good evening

నిహొంగొ వకరిమసెన్ - I dont know Japanese.

ఎ ఇ గొ గ హనసెమసు కా ? - Can you speak English?

___ డొకొ దెసు కా ? - Where is ___ ?

ఎకి వ డొకొ దెసు కా ? - Where is railway station ?

మో ఇచిదొ ఒనెగ ఇషిమసు - Can you repeat one more time.

వకరిమషిత - (I) Understood

అరిగతో గొజాయిమసు - Thank you very much

దో ఇతాషి మషితె - You are welcome (Not to mention)

సుమిమసెన్ - Excuse me

గొమెన్ నసయి - Sorry

ఒయిషి దెసు - Very Tasty

హయ్ - Yes

ఈఎ - No

ఒమెదెతో గొజయిమసు - Congratulations

ఒతాంజోబి ఒమెదెతో గొజయిమసు - Happy birthday

అకెమషితె ఒమెదెతో - Happy new year

గంబత్తె కుడసయి - Keep your chin up. (To encourage someone)

ఒట్సుకరె సమదెషిత - You have done a lot of work. ( To say 'please take rest' )
(ఈ మాట సాధారణం గా సాయంత్రం ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంటే చెబుతారు)

ఒయాసుమి నసయి - Good night ( Before going to bed)

జ మత నె - Well then, see you

సయోనర - Good bye

జపాన్ విశేషాలు - 8 ( భాష - My Observations )  

Posted by ప్రపుల్ల చంద్ర in

లిపి గురించి వ్రాసిన ముందు టపా చదివిన తరువాత ఇది చదవండి.

ఆ టపాలో చెప్పినట్టు, సాధారణంగా ఒక వాక్యంలో మూడు లిపులు వాడే అవకాశం ఉంది.
ఉదాహారణకి ఈ వాక్యం తీసుకుంటే " 私 は インド え 行きます。 "

--I------- India------to----- will go
నేను----- ఇండియా--- కి------ వెళ్తాను.
వతాషి---వా-----ఇండో----- ఎ-----ఇ-- కిమసు.
-----私 --- は----インド----え---- 行--きます。
--కాం---హిరా---కతా----హిరా---కాం---హిరా
కాం : కాంజి, హిరా : హిరాగానా, కతా : కతాకానా

వాక్య నిర్మాణం అచ్చు తెలుగులాగే ఉంది కదా !!, కర్త, కర్మ, క్రియ ( ఆంగ్లం లో అయితే కర్త, క్రియ, కర్మ కదా ). అందుకే జపనీస్ నేర్చుకునేప్పుడు అర్ధాలని తెలుగులోకి మార్చుకుంటూ నేర్చుకుంటే సుళువు అవుతుంది.

జపాన్ భాషలో అక్షరాలు తక్కువ కాబట్టి అన్నీ విదేశీ పదాలు వ్రాయలేరు. ఉదాహారణకి నా పేరు, వీరి దగ్గర ఉన్న అక్షరాలతో నా పేరుని పరపుర్ర అని వ్రాయవచ్చు :( . నేను పని చేసే కంపెనీలో ఐడి కార్డ్ ఇచ్చే దుర్మార్గుడు నా కార్డ్ మీద వ్రాసిన పేరు బరబుర్ర ( ప్రపుల్ల అన్నమాట ), ఈ విషయం నేనా లిపి నేర్చుకున్న తరువాత గాని తెలియలేదు. నాకు ఇలాంటి అనుభవం నా పేరు తమిళం లో వ్రాసినప్పుడు ఎదురయ్యింది. తమిళంలో ’ప్ ర పుల్ ల’ లేదా ’ప ర్ పు ల్ ల’ అని వ్రాస్తారు ( నాకు తెలిసి తమిళ్ లో కూడా ప్రత్యేకంగా ఒత్తులు లేవు ), చదవడం ప్రపుల్ల అనే అనుకోండి అది వేరే విషయం. బ్రబుల్ల అని కూడా చదవవచ్చు ఎందుకంటే ప,ఫ,బ,భ లకి ఒకే అక్షరం కాబట్టి (తమిళ్ లో కూడా అక్షరాలు తక్కువ, కాకపోతే ఒక్కొక్క అక్షరానికి 3,4 పిలుపులు ఉంటాయి ). జపనీస్ కి తమిళ్ కి ఎదో సంబంధం ఉన్నట్టుంది అని నేను కనిపెట్టాననుకుంటే నా కన్నా ముందే 'కాల్డ్వెల్' అనే అతను 19వ శతాబ్దంలోనే కనిపెట్టాడట (ద్రవిడ భాషలతో సంబంధం ఉందని), తరువాత కొందరు దీని పైన పరిశోధన కూడా చేశారట, మాట్లాడే విధానం, పదాలు ఒకేలా ఉన్నాయి అని కొన్ని కనిపెట్టారు కాకాపోతే చాలా మంది దీన్ని కొట్టిపడేసారు, పరిశోధనలు జరిపిన వారు సరైన రుజువులు చూపెట్టలేకపోవడం వల్ల ఆ వాదం మరుగున పడింది.

ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆంగ్లం నుండి తీసుకున్న కొన్ని పదాలని వీరు పలకలేక వీరికి తగ్గట్టుగా పిలుచుకుంటూ జపనీస్ లో ఇలా పిలవాలి అని నేర్పిస్తారు అవేవో వారి పదాలలా. ఉదాహారణకి సూపర్ మార్కెట్ ని 'సూపా' అంటారు, టెలివిజన్ ని 'తెరెబీ' అంటారు, పర్సనల్ కంప్యూటర్ ని 'పాస్కాన్' అంటారు. ఇవి జపాన్ పదాలే అన్నట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు, మనకి నేర్పిస్తారు. అలా మాట్లాడితేనే వాళ్ళకి అర్ధం అవుతుంది.

జపాన్ భాషలో లింగ భేదం లేదు (క్రియ కు ) ఆంగ్ల భాషలా, అంటే అతడు, ఆమె లాంటి పదాలు ఉన్నాయి, కాని 'చేసాడు', 'చేసింది', 'చదివాడు', 'చదివింది' ఇలా లింగ భేధాలు లేవు. ఆంగ్లం లో కనీసం 'ఆమె', 'అతడు' అని మాటలు మొదలు పెడతారు, కాని జపనీస్ మాటల్లో సాధారణం గా 'కర్త' గురించి ప్రస్తావన ఉండదు (because it is implicit). ఎదుటి వారితో మాట్లేప్పుడు 'మీరు' అని ఉపయోగించకుండా వారి పేరు తోనే పిలుస్తారు. నా ముందు టపాల్లో చెప్పినట్టు ఇంటిపేరుకి గారు తగిలించి పిలుస్తారు, ఇంటిపేరు కాబట్టి ఆడ, మగ తెలియదు. అందువల్ల దాదాపు అన్ని వాక్యాలలో లింగభేదం కనపడదు. గమ్మత్తేటంటే కొన్నిసార్లు వాక్యాల ద్వారా చెప్పింది ఆడవారో, మగవారో తెలుసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని పదాలు కేవలం ఆడవారే ఉపయోగించాలి, కొన్ని కేవలం మగవారే ఉపయోగించాలి.

జపాన్ భాషలో బహువచనం (వస్తువులకి) లేదు. మనుషులకి బహువచనం ఉంది 'మేము', 'వారు' ఇలా, కాని 'అరటిపండ్లు', 'కార్లు' ఇలాంటి పదాలు లేవు. పిలిచేప్పుడు ఒక అరటిపండు, రెండు అరటిపండు, మూడు అరటిపండు ఇలా పిలవాలి. ఈ బహువచనాల్లో కూడా ఒక తిరకాసు ఉంది. ఒకటి, రెండు ఇలా అనేప్పుడు వస్తువును బట్టి ఆ లెక్కించడానికి ఉపయోగించే పదం (ఎన్ని అని సూచించే పదం) మారుతుంది. ఉదాహారణకి కర్రలు, పెన్నులలాంటివి లెక్కపెట్టేప్పుడు ఇచిపన్, నిహన్ అని పిలుస్తారు(ఒకటి, రెండు లా అన్నమాట), టేబుల్ల లాంటివి లెక్కపెట్టేటప్పుడు హితోట్సు, ఫుతట్సు అని పిలుస్తారు (ఇది కూడా ఒకటి, రెండు లా అన్నమాట). ఇలా రకరకాల వస్తువులను వాటి ఆకారాలని బట్టి ఒకలా లెక్కపెట్టాలి. దీని వల్ల జపాన్ భాష చాలా కష్టంగా అనిపించింది.

జపాన్ భాషలో కామాలు, పదాల మధ్య ఖాళీలు ఉండవు. వాక్యాన్ని సరిగ్గా విడదీసి చదువుకోవాలి. చివరలో ఫుల్ స్టాప్ ఉంటుంది ఇలా '。'. జపనీయులు మాటలతో పాటు ముఖభావాలు ఎక్కువగానే పెడతారు.

జపాన్ భాషలో సంధులు లేవు. కాని నేను కనిపెట్టాను. కాకాపోతే ఒకే సంధి, గజడదవాదేశ సంధి ( 'చ' అక్షరం లేదు కాబట్టి 'స' ఆ స్థానంలో ఉందనుకుంటే !!). ఉదాహారణకి: యమ + సాకి = యమజాకి, కన + కవా = కనగవా, తొమొ + తాచి = తొమొదాచి. కాకపోతే ఇది అన్ని సార్లు సరికాదు కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహారణకి కవా + సాకి = కవాసాకి, కవాజాకి కాదు !!!.

మొత్తం మీద చెప్పాలంటే జపాన్ భాష నేర్చుకోవడం కొద్దిగా కష్టమే ( ఈ పాటికి మీకే తెలిసుంటుంది !!!). చాలా వాటికి ప్రత్యేక నిబంధనలు లేవు. అనుభవంతో తెలుసుకోవడమే. నేను నేర్చుకుందామని మొదలుపెట్టాను, కాని తరువాత మానేసాను. మనకసలే ఆరంభశూరత్వం ఎక్కువ కదా !! చూడాలి మళ్ళీ ఎప్పుడు మొదలుపెడుతానో.

జపాన్ విశేషాలు - 7 ( భాష )  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపనీస్ భాష గురించి చెప్పడం అంటే పెద్ద సాహసమే. నాకు తెలిసినంతలో నేను చేసే చిరు పరిచయం మాత్రమే ఈ టపా. చెప్పాలంటే జపనీస్ నేర్చుకోవడం కొద్దిగా కష్టతరమే ( అంటే నేర్చుకోలేమని కాదండోయ్ ). ఇక్కడి కామిక్స్, ఆనిమేషన్స్, వీడియోగేమ్స్ చాలా ప్రాచూర్యం పొందటం వలన అవి చదవడానికి/చూడటానికి చాలా మంది విదేశీయులు జపనీస్ నేర్చుకుంటున్నారట. మన దగ్గర కూడా చాలా యూనివర్సిటీల్లో విదేశీ భాషగా జపనీస్ నేర్చుకుంటున్నారు.

జపాన్ భాషని జపనీయులు 'నిహాంగో' అంటారు. 7వ శతాబ్దం వరకు వీరికి లిపి లేదు, ఆ తరువాత వీరు చైనీయుల దగ్గరి నుండి వారి లిపిని ( కాంజి, చిత్రాలతో ఉండే లిపి ) తీసుకున్నారు. లిపి చైనా వారిది, పలకడం వీరి భాషలో అన్నమాట. లిపితో పాటే వీరి దగ్గర లేని కొన్ని పదాలు కూడా చైనా నుండి వచ్చాయి. ఆ తరువాత బౌద్ధ సన్యాసులు కొన్ని అక్షరాలతో జపాన్ భాష రాసే విధంగా ఒక లిపి ని కనిపెట్టారు. ఆ లిపిని కతాకానా అంటారు. ఇప్పుడది విదేశీ పదాలు వ్రాయడానికి ఉపయోగిస్తున్నారు. జపాన్ భాషని సులువు చేయడానికి ఆ అక్షరాలకు వేరే లిపి కనిపెట్టారు ఆ లిపిని హిరాగానా అంటారు. కాంజీ కి బదులుగా ఈ పదాలతో వ్రాయవచ్చు. కాకపోతే మొత్తం కాంజి తో వాక్యాలు వ్రాయడం కుదరదు. హిరాగానా ఉపయోగించి కొన్ని పదాలను కలపవలసి ఉంటుంది. ఆ మూడు లిపుల ఉపయోగాలు ఇలా ఉంటాయి,

1. కాంజి. ఈ లిపిలో దాదాపు ఒక 5000 కాంజీలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పదానికి ఒక కాంజి (రేఖా చిత్రం) ఉంటుందన్నమాట. ఒక 1500 నేర్చుకుంటే సరిపోతుందట. ఈ కాంజి ఉపయోగం ఎలా ఉంటుందంటే ఉదాహారణకి 'వెళ్ళడం' అనే పదానికి ఒక కాంజి ఉంటుంది. కాకపోతే 'వెళ్తాను', 'వెళ్ళాను', 'వెళ్దాము', 'వెళ్ళబోతున్నాను' ఇలా తేడా చూపెట్టలేదు, ఆ కాంజీకి హిరాగానా లోని అక్షరాలను కలిపితే ఆ పదం పూర్తవుతుంది, అంటే కాంజితో మూలపదాన్ని వ్రాయవచ్చు.

అంతేకాక ఒకే కాంజిని సందర్భం బట్టి వేరేగా పలకాల్సి ఉంటుంది.
ఉదాహారణకి '日' అనే ఈ కాంజికి ఉన్న అర్ధాలు : రోజు, సూర్యుడు, జపాన్, రోజుల లెక్కలలో ఉపయోగిస్తారు, ఒక్కో సందర్భంలో ఒకలా పిలుస్తారు. కొన్ని కాంజీలకి 20 దాకా అర్ధాలు/పిలుపులు ఉన్నాయి.

అలాగే ఒకే పిలుపు ఉన్నా, సందర్భాన్ని బట్టి వేరే కాంజీలతో వ్రాస్తారు.
ఉదాహారణకి వేడి ని 'అట్సుయి' అంటారు, కాకాపోతే వాతావరణం లో వేడి, తినే పదార్ధం వేడి, వెచ్చదనం, warm heart ఇలా వేరే వేరే సందర్భాలలో ఒకేలా పలికినా(అట్సుయి అని) వేరే కాంజిలతో వ్రాస్తారు (厚い、篤い、熱い... ఇలా ).

ఇంకో సందర్భం ఉంది, అందులో ఒక కాంజికి ఒకే అర్ధం ఉంటుంది, కాని సందర్భాన్ని బట్టి వేరేలా పలకాలి.
ఉదాహారణకి '行' అనే కాంజి 'వెళ్ళడం' ను సూచిస్తుంది. మామూలు గా మాట్లాడేటప్పుడు ’ఇకిమస్’ అంటారు. గౌరవంగా మాట్లాడేటప్పుడు ’యుకిమస్’ అంటారు.

వేరు వేరు కాంజీల కలయికతో కొత్తపదాలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నింటికీ ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అని నిబంధనలు లేవు, మన అనుభవంతో నేర్చుకోవడమే.

కాంజి ని బొమ్మల ఆధారంగా ఎలా వ్రాయడం మొదలుపెట్టారో ఈ క్రింది బొమ్మని చూడండి. కాంజి కి బొమ్మకి సారూప్యత చూడవచ్చు. (అందులో పైన ఉన్న కాంజి చేపను సూచిస్తుంది, తరువాత గడులలో ఎలా వ్రాయలో ఉంది)



2. హిరాగానా, ఇది ఒక 71 అక్షరాలతో ఉన్న లిపి ( గుణింతాలతో సహా ), ఒత్తులు లేవు 'య' ఒత్తు, ఒత్తి పలికే ఒత్తులు ( న్న, ర్ర లాంటివి ) తప్ప, అంటే 'ప్ర', 'బ్ద' లాంటివి లేవు, వ్రాయలేము !!!. 'చ' ,'ల' , 'ట' , 'డ' అక్షరాలు లేవు. పొల్లు అక్షరాలు లేవు ఒక్క 'న్' తప్ప. చెప్పాలంటే అక్షరాలు తక్కువగా ఉన్నాయి, వీరి భాష వ్రాయడానికి ఇవి చాలు ( అంటే భాష తరువాతే లిపి వస్తుంది కాబట్టి అవే అక్షరాలు ఉంటాయనుకోండి అది వేరే విషయం).

చిన్న పిల్లలకి నేర్పేప్పుడు కాంజి కష్టం కాబట్టి హిరాగానా లో నేర్పిస్తారు. ఉదాహారణకి నదిని 'కవా' అంటారు, '川' అనే కాంజితో సూచిస్తారు. దాన్ని హిరాగానాలో 'かわ' (క వా) అని వ్రాయవచ్చు. కేవలం 71 అక్షరాలే (5000 లతో పోలిస్తే) కాబట్టి ఈ లిపి చాలా సులువు.

కాంజి లేని వాటికి, పదాలని కలపడానికి, కాంజి కి పూర్తి అర్ధం తీసుకురావడానికి హిరాగానాని ఉపయోగిస్తారు.

3. కతాకానా, ఇందులో కూడా హిరాగానా లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవే ఉన్నాయి, కాకపోతే లిపి వేరు అంతే. ఇది ముఖ్యంగా విదేశీ పదాలను వ్రాయడానికి ఉపయోగిస్తారు. వీరి భాషలోకి కూడా వేరే భాష పదాలు వచ్చి పడ్డాయి ( ముఖ్యంగా ఆంగ్ల పదాలు ). ఎంత వేరే పదాలను చేర్చుకున్నా ఇలా వేరే లిపిలో రాసి వేరుగానే ఉంచారు. అంతేకాక కతాకానా తో కంపెనీ పేర్లు, రైల్వేస్టాప్ ల పేర్లు కూడా వ్రాస్తారు.

ఇంకో రాసే విధానం ఉంది, దీని పేరు రోమాజి, జపాన్ భాషని రోమన్ అక్షరాలతో ( ఆంగ్లం లో ) వ్రాస్తారు. ఇది కేవలం విదేశీయులు నేర్చుకునేప్పుడు వాడుతారు.

నేను ఇంకో లిపి కనిపెట్టా ’తెలుజి’, ఇదేంటి అనుకుంటున్నారా, జపాన్ భాషని తెలుగు లిపిలో వ్రాయడం. పేటెంట్ ఏమి తీసుకోలేదు ఎవరైనా వాడుకోవచ్చు :) .

వీరు మాములుగా వాక్యాలు, అడ్వడైజ్ మెంట్లు ఎడమ నుండి కుడికి వ్రాస్తారు మనలా. కాకాపోతే పుస్తకాలు, పేపర్లలో మాత్రం కుడి నుండి ఎడమకి వ్రాస్తారు, అది కూడా నిలువు లైన్లలో !!!. అంటే పేజికి పూర్తి కుడివైపున పై నుండి క్రిందికి వ్రాసి తరువాత లైన్ మళ్ళీ పై నుండి మొదలు పెడతారు. వీరు కాంజి వ్రాస్తారు కాబట్టి అలా వ్రాయడం కుదురుతుంది (ఒక్కొక్కపదం ఒక బొమ్మ కాబట్టి). మనకు మాత్రం ఇది ఒక కొత్త పద్దతే !!!. ఒక మాదిరిగా ఉర్దూలాగానే, కాకపోతే నిలువు లైన్లలో.

దాదాపు జపాన్ వాక్యాలలో ఈ మూడు లిపులు ( కాంజి, హిరాగానా, కతాకానా ) కలిపి వ్రాస్తారు, కాబట్టి మూడూ నేర్చుకోవలసిందే( కాంజి కి బదులుగా హిరాగానా ఉపయోగించవచ్చు, కాని జపనీయులు చాలాచోట్ల కాంజి వ్రాస్తారు, కాబట్టి తక్కువలో తక్కువ 500 కాంజీలు నేర్చుకోవాలి !! ). ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, జపాన్ భాషలో నేను గమనించిన విషయాలు వచ్చే టపాలో. ( కొద్దిగా వ్రాద్దామని మొదలుపెడితే పెద్దగా అయ్యింది, అందుకే రెండు గా విడగొట్టాల్సి వచ్చింది)

జపాన్ విశేషాలు - 6 (రోజువారి జీవితం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపనీయుల రోజువారి జీవితం, ఇంకా ఇక్కడి work environment గురించి ఈ టపా ( నేను చూసే నా సహోద్యోగులది చెబుతాను, మిగతావారిది కూడా దాదాపు ఇలాగే ఉండవచ్చు ) .

సాధారణంగా ఉద్యోగులు ఉదయం 7 గంటలకే ఇంటి నుండి బయలుదేరుతారు. నగరంలో ఉండడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి చాలా మంది దూరప్రాంతాలలోనే ఉంటారు. కాబట్టి అలా ప్రొద్దున్నే బయలు దేరి ఒక 2 గంటల ప్రయాణం తరువాత కార్యాలయం చేరుతారు. దాదాపు 90% మంది ప్రయాణానికి రైళ్ళని ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా కార్లు ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల పెద్దగా వాడరు, వారాంతాలలో తప్ప. అంతేకాక ఇక్కడ అన్ని సిగ్నల్ల వద్ద పాదాచారులకు, వాహనాలకు ఒక్కసారే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, పాదాచారులు రోడ్డు దాటేంతవరకు వాహనాలు ఆగాల్సిందే, దాని వల్ల ఇంకా ఆలస్యం అవుతుంది. ప్రొద్దున రైళ్ళు కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. రైళ్ళో వచ్చేప్పుడు చాలా మంది కామిక్స్ పుస్తకాలు చదువుతూ ( జపనీయులకి కామిక్స్ అన్నా ఆనిమేషన్స్ అన్నా పిచ్చి ) పాటలు వింటూ లేకపోతే వీడియో గేములు ఆడుతూ కనపడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు నిలబడి ఉన్నా నిద్రపోతారు, అది ఎలా సాధ్యమో నాకు అర్ధం అవ్వలేదు. చాలా రద్దీగా ఉండే రైలు ఎక్కాలంటే ఎన్ని కష్టాలో తెలియడానికి వీడియో చూడండి.



ఆఫీస్ కి కొద్దిగా దగ్గరలో ఉన్న వాళ్ళు సైకిల్ ఉపయోగిస్తారు. ఇక్కడ సైకిళ్ల మీద ఆఫీస్ రావడాన్ని ఎవరూ నామోషీగా భావించరు. కొందరు సూట్ వేసుకొని కూడా సైకిల్ పై ఆఫీస్ కి వస్తారు. నేను చేసే కంపనీలో దాదాపు ఒక 400 మంది సైకిల్ పై వస్తారు. వీరు రైళ్లు, సైకిళ్లు ఉపయోగించడం వల్ల చాలా ఇంధనం ఆదా చేస్తున్నారు.

నలుపు రంగు సూట్లు పెళ్లిలకి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప సాధారణంగా వేసుకోరు. ఆఫీస్ కి వచ్చేప్పుడు నలుపు కాక ఇంకా వేరే ఏదైనా (నలుపు రంగుకి దగ్గర్లో ఉండే) సూట్ వేసుకుంటారు. అలా అని అందరూ సూట్లు వేసుకోరు. మాములు బట్టల్లో కూడా వస్తారు. కెనాన్ లాంటి కంపనీల్లో యునీఫాం వేసుకొని వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రత్యేకంగా ఇలాగే రావాలి అని ఏమి లేదు, ఒకతను గత సంవత్సరంగా రోజూ మోకాళ్ల దగ్గర చినిగి ఉన్న ఒకే జీన్స్ వేసుకొని వస్తున్నాడు !!!

మా ఆఫీస్ లోపలికి అడుగుపెడుతూ ఉంటే ఒక అయిదుగురు అక్కడ నిలబడి ( బయట గేట్ వద్ద కాదు, లోపల ) వచ్చిన అందరికి ’ఒహాయో గొజాయిమసు’ ( good morning ) అని చెబుతారు. చాలా మంది ఉండే సరికి కొద్దిగా సందడిగా ఉంటుంది. ఇది కేవలం ప్రొద్దున 9 గంటల లోపే ఉంటుంది. మేము ఆలస్యంగా వెళ్తాము కాబట్టి కొన్ని సార్లే చూసాము. 9 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పటి నుండి పని గంటలు మొదలవుతాయి. కాకపోతే మా ఆఫీస్ పనిగంటల విషయంలో ఎవరి ఇష్టం వారిది.

ఆఫీస్ లో అడుగుపెట్టినప్పటి నుండి పని చేస్తూనే ఉంటారు. మొదట కొద్దిసేపు ఆ రోజు చేయవలసిన వాటి గురించి చర్చించుకొని పని మొదలు పెడతారు. వ్యక్తిగత పనులు ( అంటే అంతర్జాలంలో ) అసలే చేసుకోరు. మేము చేసుకుంటాం అది వేరే విషయం. ప్రతీ చిన్న విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. సుళువుగా ఒక నిర్ణయానికి అస్సలురారు.

12 గంటలకి మళ్ళీ గంటలు మ్రోగుతాయి. అప్పుడు అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. ఆ సమయం లో లైట్లు ఆర్పేస్తారు ఒక గంట వరకు, అలా చాలానే విద్యుత్తు ఆదా చేస్తున్నారు, అలాగే భూతాపాన్ని తగ్గిస్తున్నారు. వీరు ఆహారం చాలా తొందరగా తినేస్తారు. మా ఆఫీస్ లో 6 అంతస్తులు ఉండటం తో ఒక్కో అంతస్తు వారికి ఒక్కో సమయాన్ని కేటాయించారు (ఒక్కో అంతస్తులో ప్రతీ 15 నిముషాలకి గంటలు మ్రోగుతాయి). కాబట్టి అందరూ ఒక 15 నిముషాలలో తినడం ముగించేస్తారు. తిన్న తరువాత నిద్రపోయేవారు నిద్రపోతారు, కొందరు వ్యాయామం చేస్తారు, కొందరు ఆటలు ఆడుతారు. ఇలా ఎవరి ఇష్టాలని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. తినగానే చాలా మంది దంతధావనం చేసుకుంటూ కనపడతారు.
మళ్ళీ 1 గంటకి గంటలు మ్రోగుతాయి, మళ్ళీ లైట్లు వేస్తారు, పని మొదలుపెడతారు.



జపాన్ లో మంచి నీరు పెద్దగా త్రాగరు, అందరూ ఎనర్జీ డ్రింక్స్ త్రాగుతారు. మాములుగా ప్రతీ వీధిలో వెండింగ్ మెషీన్స్ ఉంటాయి 24/7. ఫ్రూట్ డ్రింక్స్, విటమిన్ డ్రింక్స్, కోలా, టీ, కాఫీ ఇలా చాలానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్యా ఉండదు. మా ఆఫీస్ లో కూడా మా అంతస్తులో ఒక 5,6 మేషీన్లు ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఒక 7,8 రకాల చెత్తడబ్బాలు ఉంటాయి. గాజుసీసాలు ఒకదాంట్లో, ప్లాస్టిక్ సీసాలు ఒకదాంట్లో, టిన్లు ఒక దాంట్లో, పేపర్లు ఒకదాంట్లో, ప్లాస్టిక్ కవర్లు ఒకదాంట్లో, అట్టా డబ్బాలు ఒకదాంట్లో వెయ్యాలి. రిసైక్లింగ్ కి సుళువుగా ఉంటుందని అలా విడివిడిగా పెడతారు ( అభివృద్ది చెందిన అన్ని దేశాలలో ఇలాగే ఉండవచ్చు !! ). గొడుగులు పెట్టుకోడానికి స్టాండులు చాలా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా వర్షాలు పడుతూనే ఉంటాయి.

మళ్ళీ 6 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పుడు భోజనం చేస్తారు (ఇక్కడ రాత్రి భోజనం చాలా త్వరగా చేస్తారు). భోజనం తరువాత మళ్ళీ పనిలో పడతారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ కనపడతారు. కొందరు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు, ఆఖరి ట్రైన్లో ఇంటికి వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రతీ బుధవారం సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోవాలి ( రోజు ఎక్కువ పని చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని ఆ నియమం పెట్టారు), కాని కొందరు ఆ రోజు కూడా రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు.

పని ఒత్తిడి నుండి ఉపశమనం కోసం అప్పుడప్పుడు మందు పార్టీలకు వెళ్తూంటారు, వీరికి ’బీర్’ అంటే చాలా ఇష్టం, పీపాలు పీపాలు త్రాగుతారు. అప్పుడప్పుడు ’కరోకే’ కి ( కొన్ని ప్రత్యేకమైన హోటళ్లలో చిన్న స్టేజ్ ఉంటుంది, అది ఎక్కి మనం పాటలు పాడొచ్చు ) వెళ్తూ ఉంటారు.

జపాన్ భాష గురించి వచ్చే టపాలో...

జపాన్ విశేషాలు - 5 (భక్తి, దేవాలయాలు)  

Posted by ప్రపుల్ల చంద్ర in

జపాన్ లో భక్తి గురించి చెప్పాలంటే కొద్దిగా కష్టమే. మొదట నాకు జరిగిన అనుభవాలు గురించి చెప్పి తరువాత నేను తెలుసుకున్న విషయాలు చెబుతాను.

నేను జపాన్ కి వచ్చిన కొత్తలో మా జపనీస్ బాస్ మా అందరిని 'నిక్కో' (ఆ విశేషాలు మరెప్పుడైనా ) అనే ప్రదేశానికి తీసుకువెళ్తా అన్నారు. నిక్కో చాలా బాగుంది. రెండు, మూడు గుడులకు వెళ్ళాము, అన్నీ తోటలతో చాలా అందంగా ఉన్నాయి. నేను గుడిలోపలికి వెళ్లిన ప్రతిసారి ఏదైనా విగ్రహం కనపడుతుందేమో అని చూసేవాన్ని, కాని ఎక్కడా కనపడలేదు, అక్కడక్కడ డ్రాగన్ బొమ్మలు, గుడి బయట కొన్ని విచిత్ర ఆకారాలలో ఉన్న ( చూడటానికి రాక్షసులలా ఉన్న ) విగ్రహాలు కనపడ్డాయి. నేను ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టలేదు. ఇక సరే అని మా బాస్ ని అడిగా 'మనం ఇంతకి ఎవరి గుడికి వచ్చాము' అని, దానికి మా బాస్ కొద్దిగా నవ్వి 'మ్మ్ మ్మ్... నాకు తెలియదు' అన్నారు. అదేంటి తీసుకువెళ్తా అని చెప్పి తీసుకువచ్చి తెలియదంటాడే అనుకొని, సరేలే ఇలా కాదు అనుకొని ఇంకో ప్రశ్న వేసాను. 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'నేను ఎవరిని నమ్మను, నాకు నేనే దేవుణ్ణి' అన్నాడు. ఈ విషయాలను అస్సలే పట్టించుకోము అని చెప్పాడు.



ఇలా అయితే లాభం లేదు, నేనే తెలుసుకోవాలని అంతర్జాలంలో వెతకడం మొదలు పెట్టాను. ఒక పేజి చదువుతుంటే మా జపనీస్ కోలీగ్ ఇదేంటి అని అడిగాడు. జపాన్ లో ఉన్న మతం షింటో గురించి చదువుతున్నాను అని చెప్పాను. ఆ పేజీలో ఉన్న ఒక బొమ్మను (పైన ఉన్న బొమ్మ) చూపెడుతూ నేను ఆ గుళ్ళకు వెళ్తాను కాని దాని పేరు షింటో అని తెలియదు అన్నాడు. నాకు ఆశ్చరం వేసింది. మా బాస్ ని అడిగిన ప్రశ్నే ఈయనను అడిగాను, 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'అందరూ మంచి వాళ్లే'.

నాకు తెలిసిందేంటంటే ఇక్కడ దేవుణ్ణి పెద్దగా నమ్మరు, అలాగని అసలే వదిలెయ్యలేదు. ఇక్కడ ముఖ్యంగా రెండు మతాలు ఒకటి షింటో ఇంకోటి బౌద్ధమతం. కన్ఫ్యూషియస్, క్రిస్టియానిటిలు కూడా ఉన్నాయి, కాని చాలా తక్కువ. ఇక్కడ ఒక 30% మంది దేవుడిని నమ్ముతామని చెబుతారు. మిగతా వాళ్ళు ఏమి చెప్పరు. నమ్మే వారు కూడా రోజు పూజలు చెయ్యరు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనే గుడికి వెళ్తారు. ఇక వీరు సాధారణంగా పుట్టినప్పుడు జరిగే కార్యక్రమాలు షింటో పద్దతిలో, పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో (షింటో పద్దతిలో చేసుకునే వారు కూడా ఉన్నారనుకోండి), చనిపోయినప్పుడు కార్యక్రమాలు బౌద్ధ పద్దతిలో (ఎందుకంటే షింటో లో దీని గురించి ఏమి లేదు) చేస్తారు. అంటే వారికి ఏ మతం లో ఏమి నచ్చితే అదే చేసేస్తారన్న మాట. కాకాపోతే ఎవరూ వీటి గురించి మాట్లాడుకోరు.



ఇక 'షింటో' విషయానికి వస్తే, ఇది జపాన్ లో మొదలైన మొట్టమొదటి మతం. ఇందులో ప్రకృతి దేవతలను పూజిస్తారు. సూర్యుడు, వాయువు అలా. పైన నేను రాక్షసాకారంలో ఉన్న విగ్రహాలు అని చెప్పా కదా, అవి అగ్ని, వాయువు, వరుణుడు ఇలా వీరివన్న మాట. ప్రకృతి దేవతల విగ్రహాలు కాబట్టి అలా గంభీరంగా ఉన్నాయేమో. ఇక గుళ్ళో ఉండే తోటలు చాలా అందంగా ఉంటాయి, ఎంతైనా ప్రకృతి ఆరాధకులు కదా. చాలా రకాల చెట్లు, దీపస్తంభాలు, మంచిగా పేర్చినా రాళ్ళు, చిన్ని చిన్ని సరస్సులు, వీటి వల్ల చల్లగా ఉండే వాతావరణం, అన్నీ చాలా బాగుంటాయి. వాటి అందం గురించి నేను చెప్పడం కన్నా మీరే చూడండి.









బౌద్ధమతం ఇక్కడికి 6 వ శతాబ్దంలో వచ్చింది. చైనా నుండి కొరియా, కొరియా నుండి జపాన్ వచ్చింది. అప్పటి రాజులకు చాలా నచ్చి స్వీకరించారు, చాలా గుళ్ళు కట్టించారు. తరువాత తరువాత బౌద్ధ మతంలోనే చాలా రకాలు వచ్చాయి, మహాయాన బౌద్ధం, వజ్రయాన బౌద్ధం, జెన్ బౌద్ధం అలా చాలానే ఉన్నాయి. ఇంకా ఏంటంటే బౌద్ధాన్ని ఇక్కడ లొకలైజ్ చేసారు. మనదగ్గరి చాలా పేర్లు ఇక్కడి పేర్లకు తగ్గట్టు గా మార్చారు. ఉదాహారణకి వినాయకుణ్ణి 'కాంగీ-తెన్' అంటారు, శివుడిని 'దైజిజాయ్-తెన్' అని అంటారు(బౌద్ధమతం తో పాటు ఇవి వచ్చుంటాయి, ఎలా వచ్చాయో నాకు తెలియదు). నేను కమకుర, క్యోటో వెళ్ళినప్పుడు అక్కడి గుళ్ళలో భారతీయ దేవుళ్ల విగ్రహాలను చాలానే చూసాను. విష్ణు, బ్రహ్మ, నారదుడు, తుంబురుడు ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటి క్రింద మొదలు జపనీస్ పేరు, తరువాత సంస్కృతంలో ఈ పేరు అని రాసి ఉన్నాయి (ఈ గుళ్ళలో ఫోటోగ్రఫి నిషిద్ధం అందుకే ఫోటోలు తియ్యలేకపోయాను). అంతేకాక బౌద్ధమతం షింటో తో బాగా కలిసిపోయింది. అందులో ఉండే ప్రకృతి దేవతలను వరణుడు, ఇంద్రుడు ఇలా వీరి తో పోల్చి అంతా ఒకటే అనే భావన తీసుకొచ్చి ఉంటారు. అప్పటి గుళ్ళు షింటో, బౌద్ధం రెండు కలిపి కట్టించారు.



గుడిలోపలికి వెళ్ళే ముందు చెప్పులు విప్పడం, చేతులు కడుక్కోవడం, ఊది బత్తీలు వెలిగించడం, క్యాండిల్ వెలిగించడం, దీపలు వెలిగించడం, గంట కొట్టడం, ఏదైన కోరిక ఉంటే చీటీ రాసి గుడి దగ్గర కట్టడం, హుండీ లో డబ్బులు వేయడం ఇలా చాలా ఉన్నాయి మనదగ్గరిలా. నేను వెళ్లిన ఒక గుడిలో డబ్బులను అక్కడ ఉన్న నీటితో తడిపితే డబ్బులు రెట్టింపు అవుతాయని (అంటే భవిష్యత్తులో) నమ్మకం అట. చాలా మంది అలా చేస్తూ కనపడ్డారు. కొందరైతే కాగితం నోట్లు కూడా తడుపుతున్నారు. తరువాత అక్కడ ఉన్న ఊది బత్తీల వేడిలో ఆరబెట్టారు. అది చూడగానే మన ఆసియా వాళ్లకి ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి అని అనిపించింది.





నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, కొన్ని గుళ్ళల్లో డ్రాగన్ బొమ్మలు ఉండటం. డ్రాగన్ అనగానే నా దృష్టిలో మంటలు చిమ్ముతూ అందరిని భయపెట్టే ఒక విలన్. అలాంటి విలన్ ను వీళ్లు పూజించటం ఏంటి అనే ప్రశ్న నా మెదడును తొలిచేది. నేను క్యోటో లో ఒక గుళ్ళో 'వాసుకి, ది డ్రాగన్ కింగ్' అని చూసిన తరువాత నా సందేహం తీరింది. అంటే మనదగ్గరి పాములు ఇక్కడి డ్రాగన్ లు అన్నమాట. మనదగ్గర పాములను పూజించినట్టు ( నాగుల చవితి, నాగుల పంచమి ) ఇక్కడ డ్రాగన్ లను పూజిస్తారు. కాని ఇంకో అనుమానం ఏంటంటే పాములు అయితే ఉన్నాయి, కాని డ్రాగన్ లు లేవు కదా అని. మళ్లీ ఆలోచిస్తే, మనదగ్గర ఆదిశేషువు, వాసుకి లా పది తలల పాములు లేవు కదా ( ప్రస్తుతం ) అలాగే డ్రాగన్ లు కూడా అని అనుకున్నాను. అలాగే మంచి డ్రాగన్ లు ఉంటాయి చేడువి ఉంటాయి. ఎప్పటిలా చెడు వాటిపైన మంచివి విజయం సాధిస్తాయి.



రెండో ప్రపంచ యుద్దం తరువాత ప్రజలు దేవుడు, మతం గురించి పట్టించుకోవడం మానేసారు. మొదట చెప్పినట్టు ఏ మతం లో ఏది నచ్చితే అది చేస్తారు. దైనందిన జీవితంలో షింటో, బౌద్ధ మత పద్దతులు అవలంభిస్తారట, కాని ఆ విషయం వారికే తెలియదు.

జపాన్ విశేషాలు - 4 (ఆహారపు అలవాట్లు)  

Posted by ప్రపుల్ల చంద్ర in


జపాన్ అనగానే వీళ్లు అన్నీ తింటారు అని అనుకోకండి, సముద్రంలో దొరికే అన్నింటిని మాత్రం తింటారు. కప్పలు, తేళ్ళు, పాములు మొదలైనవి తినరు చైనా వాళ్లలా !!. వీరి ఆహారంలో ఎక్కువ నూనె వేయరు, ఉప్పు కారాలు ఎక్కువగా వాడరు. చీజ్ ఎక్కువగా తినరు. ప్రపంచంలో ఆరోగ్యకరమైనా ఆహారం వీరిదేనేమో. ఇక్కడి తీపి వంటకాలు అంత తీపిగా ఉండవు. ఒకసారి మా కొలీగ్ కి ’జిలేబి’ ఇస్తే, అతను తిన్న తరువాత ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో గొడ్డు కారం తిని ప్రకాష్ రాజ్ ఎలా అరుస్తాడో అలా అరిచాడు. ఆవకాయ తినిపిస్తే చచ్చిపోతాడేమో!!. వీరు ఏ రుచి ఎక్కువ మోతాదులో ఉన్నా తినలేరు. కాని వీరి వంటకాలు చాలా రుచిగా(ప్రత్యేకమైన) ఉంటాయట. శాఖాహారం నేను తిన్నాను, కొన్నింటి రుచి బాగున్నాయి. మాంసాహారం కూడా చాలా బాగుంటుందట, నా స్నేహితులు ఇష్టంగా తింటారు. నేను చెప్పబోయే చాలా విషయాలు నా స్నేహితుల అభిప్రాయలే, ఎందుకంటే ఇక్కడ మాంసాహారం ఎక్కువ గనుక.

వీరి ఆహారం లో అన్నం ఒక ముఖ్యభాగం. వీళ్లు ఆహరం పొడుగు పుల్లలతో ( అదేనండి చాప్ స్టిక్స్ తో !!!) తింటారు కాబట్టి మెత్తగా ఉండేట్టు చూసుకుంటారు, ముద్దగా ఒక్కచోటే ఉంటే పుల్లలతో పట్టుకోవడం సుళువు కదా. ఇక్కడ వీరు మనలా కూరలు చేసుకుంటారు, కాకాపోతే అన్నం, కూర కలుపుకొని తినరు. మొదలు కొద్దిగా కూర తిని, తరువాత కొద్దిగా అన్నం, అలా తింటారు.


జపాన్ ఆహారం అని అనగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది సుషి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది, జపనీయులకు చాలా ఇష్టమైన వంటకం. సుషి అంటే కేవలం పచ్చి చేప మాంసం (raw fish) అని అందరూ అనుకుంటారు, కాని దానితో పాటు వెనిగర్ వేసి చేసే అన్నం (చాలా రుచిగా ఉంటుందట), ప్రత్యేకమైన అల్లం ముక్కలు, ఇంకా వేరే సాస్ ( mayonnise sauce లాంటి ) లతో కలిపి సుషి చేస్తారు. చాలా రకరకాల సుషి లు ఉన్నాయి. దాదాపు సముద్రం లో దొరికే అన్నిటితో ( చేపలు, రొయ్యలు, ఆక్టోపస్, నక్షత్ర చేప, స్క్విడ్ వగైరా వగైరా లతో) సుషి చేస్తారు. రుచిగా ఉండటమే కాక చాలా శక్తిని కూడా ఇస్తుందట. నా స్నేహితుడు సుషి తినడం కోసమని టోక్యో లో పెద్ద చేపల మార్కెట్ ట్సుకిజి (tsujiki) కి ప్రొద్దున్నే 6 గంటలకు వెళ్లాడు, తాజా సుషి దొరుకుతుందని. అప్పటికే చాలా రద్దీగా ఉందట. ప్రొద్దున తింటే మళ్ళీ మరుసటి రోజు వరకు ఏమీ తినలేదు. అంత శక్తి ఇస్తుంది ( పచ్చిది కాబట్టి అరగడానికి చాలా సమయం పడుతుంది, అది వేరే విషయం).


సోబా నూడిల్స్ జపాన్ వారి నూడిల్స్, ఇవి బక్ వీట్ (buckwheat) మరియు గోధుమలతో చేస్తారు. ఇవి మాములు నూడిల్స్ (చైనా నూడిల్స్) లాగే ఉంటాయి కాని గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వేరు వేరు సూపులతో తింటారు.



ఉదాన్ అనే ఇంకో రకం నూడిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి మాములు నూడిల్స్ కన్నా లావుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇవి గోధుమలతో చేస్తారు. ఇవి కూడా వేరు వేరు సూపులు, పదార్ధాలతో కలిపి తింటారు.



రామెన్, ఇది చైనీస్ నూడిల్స్, సూప్, గ్రుడ్డు, చికెన్ ఇలా చాలా వాటితో కలిపి చేస్తారు.



తోఫు, జపాన్ లో చాలా ప్రాచూర్యం పొందిన శాఖాహారం. ఇది బీన్స్ తో చేస్తారు. ఇది చూడడానికి అచ్చు మన దగ్గరి పనీర్ లా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. వీటితో రకరకాల వంటకాలు చేస్తారు.



ఒనిగిరి, అన్నం ను 'sea weed' ( ఆకుపచ్చ రంగులో ఉండే పాచి లాంటి పదార్ధం, ఇది సముద్రం లో దొరుకుతుంది) లో చుట్టి, మధ్యలో రకరకాల పదార్ధాలను కలిపి తయారుచేస్తారు. ఇది జపాన్ లో చాలా మంది తినే అల్పాహారం. జపాన్ వాళ్లు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి కారణం, ఈ seaweed, సుషి, జపనీస్ టీ ( గ్రీన్ టీ ) తీసుకోవడం వల్లే.



తెంపురా, ఇవి దాదాపు మనదగ్గరి బజ్జీలలాంటివి. ఇవి చాలా కూరగాయలతో చేస్తారు, రొయ్యలతో కూడా చేస్తారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది.



యాకితోరి, ఇది చికెన్ తో చేస్తారు (grilled chicken) . ఇది చాలా చోట్ల దొరికే రుచికరమైన వంటకం.

అన్నం తో చేసే లిక్కర్ 'సకే' ఇక్కడ ప్రాంతీయంగా దొరికే మద్యం. అలాగే ఆలుగడ్డ తో చేసే 'సోచో' కూడా.



చాలా స్వీట్స్ ఇక్కడ బియ్యం (పొడి), బీన్స్ లతో చేస్తారు. అన్నింటికన్నా బాగుండేది(ప్రాచూర్యమైనది కూడా) యాట్సుహషి. నాకు చాలా నచ్చింది.



మీరు మైల్ ఫార్వర్డ్స్ లో జపనీస్ కేక్స్ అని చాలా మంచిగా (అందంగా) ఉన్నవి చూసుంటారు. మేము ఒకసారి బయటికి వెళ్లినప్పుడు అచ్చు అలాంటివే చూసాము. నోరూరి ఒక నాలుగు రకాలు తీసుకొని నలుగురము కొద్ది కొద్దిగా తిన్నాము. చాలా చెండాలంగా ఉన్నాయి, నోట్లో పెట్టుకోడానికి కూడా వీల్లేవు. అస్సలు రుచే లేవు. చెప్పాను కదా వీరు తీపి ఎక్కువగా తినరు. మళ్లీ జన్మలో తినొద్దని నిర్ణయించుకున్నాము. మేము తిన్నవే బాగోలేవేమో మాకు తెలియదు. అయినా తియ్యగా లేకపోతే క్రీం రుచి ఏముంటుంది.

సాధారణం గా దాదాపు అన్నీ వంటకాలలో మటన్, పోర్క్, చికెన్, బీఫ్ ఏదో ఒకటి ఉంటుంది. వద్దనుకుంటే 'నిక్కు నాషి' ( మాంసం వద్దు ) అని చెప్తే వెయ్యరు. కాని వీళ్ల దౄష్టిలో చేపలు ( సముద్రం లో దొరికే రొయ్యలలాంటివి కూడా ) మాంసం కాదు. ప్రత్యేకంగా 'సకానా దమే' ( చేపలు వద్దు ) అని చెప్పాలి. ఈ విషయాలలో శాఖాహారులు జాగ్రత్తగా ఉండాలి. మీరే వండుకోవాలనుకుంటే కూరగాయాలు మన దగ్గరిలాగే దొరుకుతాయి, కొన్ని ఇండియన్ గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. మేమైతే రోజు వండుకుంటాము.

మొత్తంమీద చెప్పాలంటే భోజనప్రియులు ( ముఖ్యంగా మాంసాహారులు ) కొత్త రుచికరమైన ఆహారం అది కూడా ఆరోగ్యమైనది తినవచ్చు.

గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్లో వెతికినవి.