రోటీ, కపడా, మకాన్ ఔర్ ?  

Posted by ప్రపుల్ల చంద్ర in



ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెబుతారు ’రక్షణ’ అని, ఎందుకంటే అదికూడా ఒక ప్రాధమిక అవసరంగా మారింది. ఇంటి బయట అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు, వస్తామో లేదో అని. మొన్న జరిగిన హింసాకాండకి చలించని వారుండరు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగేసరికి దేశమంతటా భారీ స్పందన వచ్చింది, కాని ఇలాంటి సంఘటనలు దేశవిభజన నాటి నుండి కాశ్మీర్ లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు తెగబడి ఏ ప్రాంతం లో కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. భారతదేశంలోనే వారికి సహాయం దొరుకుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్ని పూర్వాపరాలు, అవి ఆపే ప్రయత్నం ఎలా చేయవచ్చో అన్న నా ఆలోచనలని పంచుకోవాలనే ప్రయత్నమే ఈ టపా.

కాశ్మీర్ వరకే ఉండే గొడవలు దేశం మొత్తం వ్యాపించడానికి కారణం బాబ్రి మసీద్ కూల్చివేత అని అనుకునే వాడిని, కాని తీవ్రవాదం మాత్రం అప్పటినుండే మొదలయ్యింది. ఇక గొడవల విషయానికి వస్తే ముస్లిం రాజులు 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మొదలయ్యింది. గుడులను ధ్వంసం చేయడం, మత మార్పిడులు చాలా జరిగాయి. అలా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లాస్ లోకి టీచర్ వచ్చాక అల్లరి చేసే పిల్లలు కాస్త నిశ్శబ్దంగా కూర్చునేటట్లుగా, ఆంగ్లేయులు వచ్చాక గొడవలు తగ్గించేసారు. మ్యూటిని అప్పుడు ఆంగ్లేయులు చిచ్చు పెట్టినా.... తరువాత అది సర్దుకుంది. సరైన ప్రాతినిధ్యం లేదని అలీజిన్నా లాంటి నాయకులు కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్రం రావడం, భారతందేశంలో ముస్లింలకు న్యాయం జరగదని వారు భావించి ప్రత్యేక దేశం కావాలని అడగడం జరిగింది, ఆ తరువాతి పరిస్థితులు ఎంతో రక్తపాతానికి తెరతీసింది. తరువాత కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఇక బాబ్రి మసీద్ విషయానికి వస్తే బాబర్ ఆ మసీద్ కట్టినప్పటి నుండి అది వివాదాస్పదమే. రామజన్మ భూమి పైన ఉన్న గుడిని కూల్చి, అక్కడ మసీద్ కట్టారని వాదన ఉంది (అలాంటిది ఏమీ లేదని ముస్లింల వాదన). మ్యూటిని ముందు వరకు హిందు, ముస్లిం లు అందరూ అక్కడ పూజలు జరిపేవారు. కాని మ్యూటిని గొడవల తరువాత హిందువులను అనుమతించలేదు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఆ మసీద్ ముందే చేసేవారు. ఆ మసీద్ యొక్క ఒక భాగం లో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించినా అధికారులు అనుమతించలేదు. తరువాత జరిగిన గొడవలలో కొద్దిగా కూలిపోతే ఆంగ్లేయులు కట్టించారు. స్వాతంత్రం తరువాత 1949 లో ఒకరాత్రి కాపలా పోలిసుల కన్నుగప్పి సీతారాముల విగ్రహాలని లోపల ప్రతిష్టించారు. తరువాత హిందూ భక్తులు మసీద్ లోపలికి రావాలని ప్రయత్నించడం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆ గుడిని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేసారు. 1984 నుండి అక్కడ గుడి కట్టాలని VHP, BJP లు గొడవలు చేయడం, కోర్టు ఆదేశాలని ప్రక్కన పెట్టి 1992 లో మసీద్ కూల్చడం జరిగింది. అది ఒక విధంగా మన రాజ్యాంగాన్ని మనమే వెక్కిరించినట్టు !!! నా ఉద్దేశ్యం ప్రకారం సరైన ఆధారాలు చూపి న్యాయపరంగా సాధించుకుంటే బాగుండేది. అది ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను!!! ఈ పని వల్ల సమస్య మరింత జటిలమైంది. మతవిద్వేషాలు రగిలి ఎన్నో గొడవలకి ఆజ్యం పోసింది. ముస్లింలలో అభద్రతాభావం పెంచింది. ఇది ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొట్టి వారి సహాయంతో చెలరేగిపోతున్నారు. రామజన్మభూమి దగ్గర జరిగిన త్రవ్వకాల ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అక్కడ రామాలయం ఉందనే ఆధారాలు ఎన్ని దొరికాయో, లేవని కూడా అన్నే దొరికాయి. అసలు సంగతి రామునికే తెలియాలి !!!

మరి ఇప్పుడు ఏం చేయాలి !!!!

ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తప్పులు ఇద్దరి వైపు జరిగిపోయాయి. అన్నింటికి అవతలి వారే కారణం అని చూపెట్టుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మానెయ్యాలి.

అయోధ్యలో రాముడి గుడి గురించి ప్రస్తావన తీసుకు రాకపోవడం చాలా మంచింది. ఒకవేళ పట్టుబట్టి కట్టినా ( ఒకవేళ అక్కడ గుడి ఉందని ఋజువైతే! ) గుడికి ఎమైనా జరిగితే గోద్రా కన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అనవసరంగా దేశంలో అస్థిరత వస్తుంది. అప్పుడు ఇంకెన్ని తీవ్రవాద సంస్థలు మొదలవుతాయో.

కాశ్మీర్ విషయానికి వస్తే అది ఇచ్చే సమస్యే లేదు. కాశ్మీర్ ఇచ్చినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు, ఇంకా పెరిగినా పెరగొచ్చు. అంతే కాక అక్కడ ఉన్న 30% హిందువుల గురించి కూడా ఆలోచించాలి ( కనీసం ఈ విషయం లో నైనా మనం అన్ని దేశాలలా ఆలోచించాలి ). పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అందరికి తెలిసిందే !!. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి కన్నా భారతదేశంలో ముస్లింల పరిస్థితి బాగుందని ఖచ్చితంగా చెప్పగలను. 1989 లో కాశ్మీరీ పండిట్లకి వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టారు, స్వాతంత్రం ఇస్తే ఇంకేం చేస్తారో.

భారతదేశం ఏర్పడినప్పటి నుండి లౌకిక రాజ్యం గా ఉంటున్నాం, అది అందరూ గౌరవించాలి. ప్రభుత్వం మాదే కదా అని ' రాముడే లేడు ' అనే కాంగ్రెస్ నాయకులకి, నోరుంది కదా అని 'రాముడు పెద్ద తాగుబోతు' అనే కరుణానిధి లాంటి నాయకులకి, మెజారిటీలము కదా అని ' బాబ్రి మసీద్ గతే మీకు పడుతుంది ' అని హెచ్చరించే (సామ్నా పత్రికలో) బాల్ థాకరే లాంటి నాయకులకి ప్రజలు బుద్ది చెప్పాలి.

మన దగ్గరి సమస్యలని కేవలం ప్రాంతీయ సమస్యలు గానే చూస్తుంన్నాము, దేశ సమస్యలు గా చూడటం లేదు. మొన్నటి వరకు కాశ్మీర్ తీవ్రవాదం కేవలం కాశ్మీర్ సమస్యగానే చూసాము, కాని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం వల్ల జాతీయ సమస్య గా పరిణమించింది. మొన్న ముంబయి దాడులు జరిగిన తరువాత రోజే అస్సాం లో రైలు లో బాంబు వల్ల ముగ్గురు చనిపోయారు, ఆ విషయం గురించి పెద్దగా స్పందనే రాలేదు. కాశ్మీర్ తీవ్రవాదం అయినా, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తీవ్రవాదమైనా, దండాకారణ్యంలో మావోయిస్టులనైనా, దేశ సమస్యకు కారణం ఎవరైనా మనందరం ఒక్కటిగా ఎదురుకోవాలి. జాతీయ సమైక్యతను పెంచాలి.

ఒకవైపు అందరం ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు మన ప్రియతమ కరుణానిధి గారు LTTE వాళ్ళని రక్షించే పనిలో ఉన్నారు. ఈ విధంగా మనది ద్వంద వైఖరి అని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నమాట. శ్రీలంక ప్రజలు 'వారికి వాళ్ళ సమస్యే తీర్చుకోవడం తెలియదు, మనది తీరుస్తారా' అని నవ్వుకుంటున్నారు. మన నాయకులకు ఎప్పుడు బుద్ది వస్తుందో!!!

కొందరు ముస్లింలకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటం వల్ల అందరు ముస్లింలు ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు. అందువల్ల కొందరు హిందువులు ముస్లింలను స్నేహితులుగా చేసుకోవడం లోను, ఇల్లు అద్దెకు ఇవ్వడం లాంటి విషయాలలోను ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి విషయాలలో మార్పు రావాలి.

ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా భారతీయ ముస్లింలు వేధింపులకు గురి అవుతున్నాం అని భాధ పడుతున్నారు. ప్రశ్నించబడేది కేవలం అనుమానితులే, అది కూడా నేర పరిశోధనలో భాగంగానే తప్ప ఇస్లాం మీద ద్వేషం తో కాదని ముస్లింలు గ్రహించాలి. దానికి కారణం కూడా కొందరు భారతీయ ముస్లింలు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడిన సందర్భాలు చాలా బయటపడ్డాయి కాబట్టి.

భారతదేశంలో ముస్లింలకి సరైనా ప్రాతినిధ్యం లేదా, ఆర్ధికంగా వెనక బడ్డారా? అని అడిగితే దానికి సమాధానం అవుననే వస్తుంది. సచార్ రిపోర్ట్ లో మనం పూర్తి గణాంకాలు చూడవచ్చు. ఆ రిపోర్ట్ దాకా ఎందుకు, మనం చదివిన ప్రదేశాలలో, ఉద్యోగం చేసే చోట చూస్తే మనకే తెలుస్తుంది... వారి ప్రాతినిధ్యం ఏంతో. వారి అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ముస్లింలే కాదు మన దేశంలో కోట్ల మంది హిందువులు కూడా కటిక పేదరికం లో ఉన్నారు. దాదాపు 30% (అంటే ఒక 30 కోట్లనుకోండి !!) మంది దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్లు మత ప్రాతిపదకన కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికి ఇవ్వాలనేదే చాలా మంది కోరిక. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ యొక్క అవసరం ఎంతైనా ఉంది. పేదరికంలో మగ్గుతున్న ఎందరో అమాయకులైన ముస్లిం యువకులను తీవ్రవాదులు తమ పావులుగా వాడుకుంటుంన్నారు, ఈ విషయం లో వారిని మరింత విజ్ఞానవంతులను చెయ్యాలి. మన దేశంలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

దేశవిభజన సందర్భంలో అక్షరాస్యులైన, ధనికులైనా ముస్లింలు చాలా మంది పాకిస్థాన్ కి వెళ్ళారు, అందువల్ల ముస్లింలలో పేదవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము ( ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ). మైనారిటీలం కాబట్టే మాకు సరైనా అవకాశాలు దొరకడం లేదు అనే భావన చాలా మంది లో ఉంది, కాని అది కేవలం రాజకీయనాయకులు సృష్టి మాత్రమే, రాజకీయాలు, ఆటలు, సినిమాలలో ( చెప్పాలంటే బాలివుడ్ మొత్తం వారిదే) ముస్లింలను ఎంతో మందిని చూడవచ్చు. ఇక అజారుద్దీన్ లాంటి వారు 'మైనారిటీలమనే మా మీద వివక్ష' అని నాటకాలాడటం, మతం అడ్డం పెట్టుకొని MIM వాళ్ళు రౌడీయిజం చేయడం లాంటి వాటి వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఈ విషయాన్ని కూడా ముస్లింలు గుర్తించాలి.

అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ లింక్ దొరికింది. హిందు-ముస్లిం వివాదాలతో పాటు కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విషయాలు అవును కదా అని అనిపించాయి. ఉదాహారణకి, పోలీసులు ఉద్యోగంలో చేరక ముందు నుండి ఉన్న నమ్మకాలని (దేవుడు, మతం....) వారు మార్చుకోరు. అందువల్ల హిందు-ముస్లిం గొడవలు జరిగేప్పుడు పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో సంస్కరణలు అవసరం. ఇదే ప్రశ్న పోలీసులని అడిగితే గొడవలు జరిగేప్పుడు ఎవరు aggressive గా ఉంటే వారిని control చేయడానికి ప్రయత్నిస్తాం అంటారు.

పరిస్థితులన్ని చక్కబడి అందరూ ఒక కుటుంబంలా ఉండాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు !!!

This entry was posted on Thursday, December 11, 2008 at 5:22 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

3 comments

నిజమే రోటి మకాన్ ఔర్ రక్షణ correct చెప్పారు

December 18, 2008 at 3:07 AM

@నేస్తం,
ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి !

December 19, 2008 at 6:06 AM

Prapulla, mana Mahatma Gandhi garu cheppina "An eye for an eye makes the whole world blind" sentence ee Janalaki artham iyye antha varaku ee Hindu vs Muslim godavalu jaruguthooney vuntai ... both are responsible for the things happening now in India. Anni mathalu teesi "Manushula Matham" ani pedithey Janalaku thikka kuduruthundi ...

December 30, 2008 at 2:54 AM

Post a Comment