కమకుర, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



’కమకుర’ నాకు జపాన్ లో చాలా బాగా నచ్చిన ప్రదేశం. కమకుర 800 సంవత్సరాల క్రితం జపాన్ కి రాజధానిగా ఉండేది, అదే సమయంలో ఇక్కడ ఎన్నో బౌద్ద, షింటో దేవాలయాలు కట్టడం జరిగింది. ఎన్నో గుడులకి, బీచ్ లకి ప్రఖ్యాతి చెందింది. టోక్యో నుండి ఒక గంటలో అక్కడికి చేరుకోవచ్చు.



మొదట మేము ’కెన్ చోజి’ అనే జెన్ బౌద్ద దేవాలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ లేరు. గిలిగింతలు పెడుతున్న చలి, సూర్యున్ని మింగేసిన మేఘాలు, చుట్టూ రకరకాల చెట్లు (ముందే చెప్పిన్నట్టు ఇక్కడి గుడులలో తోటలు చాలా అందంగా ఉంటాయి), చుట్టూ ఉన్న కొండలు, వాటి మీద దట్టంగా ఉన్న చెట్లు, అక్కడక్కడ ఉన్న గుడులు, లయబద్దంగా పక్షుల చేస్తున్న శబ్దం, వీటన్నిటితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా రోజుల తరువాత నగరానికి దూరంగా వచ్చినందుకు అనుకుంటాను ఆ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది. అంతా కలయతిరిగి వెళ్ళిపోయే సమయానికి జనాలు రావడం మొదలుపెట్టారు. ఆ తరువాత ’ఎన్ గకుజి’ దేవాలయానికి వెళ్ళాము, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ మంది ఉండే సరికి మొదటి ప్రదేశం అంత ప్రశాంతంగా లేదు, కాని తోటలు మాత్రం ఎప్పటిలా చాలా బాగున్నాయి.



కమకుర లో హైకింగ్ ట్రయల్స్ కూడా చాలా బాగుంటాయి. మేము గ్రేట్ బుద్ద విగ్రహాన్ని చేరే విధంగా మా హైకింగ్ కోర్స్ ని ఎంచుకున్నాము. చూడటానికి చిట్టడవిలా ఉండి ఎగుడుదిగుడు కొండలతో హైకింగ్ చాలా సరదాగా అనిపించింది. మధ్యలో ’జెనియరయి బెంతెన్’ గుడి కి వెళ్ళాము. జెనియరయి అంటే డబ్బులను కడగడం అని అర్ధం. డబ్బులను కడగడం ఏంటని అంటారా, ఇక్కడి గుడిలో ఒక చిన్న గుహ ఉంది, అందులో ఒక చిన్న నీటి ప్రవాహం ఉంటుంది, ఆ నీటి తో డబ్బులను కడిగితే అవి రెట్టింపు అవుతాయని వారి నమ్మకం (వెంటనే కాదండోయ్, కొన్ని రోజుల తరువాత !!). చాలా మంది డబ్బులను కడుగుతూ కనపడ్డారు, మేము కూడా మా అదృష్టాన్ని పరిక్షించుకున్నాము. కొందరైతే నోట్లను కూడా కడుగుతున్నారు, ఆ తరువాత బయట ఉన్న అగరుబత్తీల వేడిలో ఆరబెట్టుకున్నారు. ఇది గమనిస్తున్న కొందరు పాశ్చత్యులు "వీళ్లేంటి డబ్బులను తగలపెడుతున్నారు" అని జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి నమ్మకాలు వారివి.



తరువాత మళ్ళీ మా నడకను మొదలుపెట్టాము. దూరంగా కనపడే పసిఫిక్ మహాసముద్రం చూడడానికి ఎంతో బాగుంది. దాదాపు ఒక గంట నడక తరువాత ’గ్రేట్ బుద్ద’ విగ్రహం (డయిబుట్సు) కి చేరుకున్నాము. ఇది రాగితో చేసిన విగ్రహం. ఈ ప్రదేశంలో మొదట ఒక గుడి ఉండేది, కాని 15వ శతాబ్దంలో వచ్చిన సునామి వల్ల గుడి మొత్తం కొట్టుకుపోయి ఒక విగ్రహం మాత్రం మిగిలిఉంది. అలా అప్పటి నుండి ఆ విగ్రహం బయటే ఉండేసరికి ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. విగ్రహం క్రింద ఉన్న మెట్ల ద్వారా విగ్రహం లోపలికి వెళ్ళవచ్చు.




ఫోటో : గ్రేట్ బుద్ద పాదరక్షలు

డయిబుట్సు తరువాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న ’హసెదర’ అనే జొడొ బౌద్దమతానికి చెందిన గుడికి వెళ్ళాము. ఆ గుడిలో చెక్కతో చేయబడిన Kannon(god of mercy) పదకొండు తలల విగ్రహం ఉంది. ఇది జపాన్ లో చెక్కతో చేయబడిన విగ్రహాలలో పెద్దది. గుడిలో ఉన్న చిన్న చిన్న సరస్సులు తాబేళ్ళు, చేపలతో ఉండి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఆ గుడిలో ఉన్న ఒక గుహలో ఇంకా ఎన్నో విగ్రహాలను చూడవచ్చు. గుడి ప్రక్కనే చిన్న మ్యూజియం ఉంది. అందులో హిందూమతం నుండి బౌద్దమతం లోకి తీసుకోబడిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంద్ర, సూర్య, వరుణ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటి క్రింద జపనీస్ పేర్లు ఉండి దాని ప్రక్కనే సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. కమకురలో ఇంకా చాలా గుడులు ఉన్నాయి, కాని సమయాభావం వల్ల వెళ్ళడం కుదరలేదు.



చివరగా పసిఫిక్ మహాసముద్ర తీరానికి చేరుకున్నాము. పసిఫిక్ సముద్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది ప్రత్యక్షంగా చూడటం ఒక విధంగా సంతోషమేగా మరి.అతి పెద్దదైన మహా సముద్రం కాబట్టి చూడటానికి గంభీరంగా కనపడింది. సర్ఫింగ్, యాచింగ్ చేసే వాళ్ళు చాలా మంది కనపడ్డారు. అక్కడి బీచ్ లోనే సాయంత్రం వరకు గడిపి సూర్యాస్తమయాన్ని చూసి వెనుదిరిగాము.


నేను తీసిన ఫోటోలలో నాకు చాలా నచ్చిన ఫోటో

రోటీ, కపడా, మకాన్ ఔర్ ?  

Posted by ప్రపుల్ల చంద్ర in



ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెబుతారు ’రక్షణ’ అని, ఎందుకంటే అదికూడా ఒక ప్రాధమిక అవసరంగా మారింది. ఇంటి బయట అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు, వస్తామో లేదో అని. మొన్న జరిగిన హింసాకాండకి చలించని వారుండరు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగేసరికి దేశమంతటా భారీ స్పందన వచ్చింది, కాని ఇలాంటి సంఘటనలు దేశవిభజన నాటి నుండి కాశ్మీర్ లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు తెగబడి ఏ ప్రాంతం లో కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. భారతదేశంలోనే వారికి సహాయం దొరుకుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్ని పూర్వాపరాలు, అవి ఆపే ప్రయత్నం ఎలా చేయవచ్చో అన్న నా ఆలోచనలని పంచుకోవాలనే ప్రయత్నమే ఈ టపా.

కాశ్మీర్ వరకే ఉండే గొడవలు దేశం మొత్తం వ్యాపించడానికి కారణం బాబ్రి మసీద్ కూల్చివేత అని అనుకునే వాడిని, కాని తీవ్రవాదం మాత్రం అప్పటినుండే మొదలయ్యింది. ఇక గొడవల విషయానికి వస్తే ముస్లిం రాజులు 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మొదలయ్యింది. గుడులను ధ్వంసం చేయడం, మత మార్పిడులు చాలా జరిగాయి. అలా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లాస్ లోకి టీచర్ వచ్చాక అల్లరి చేసే పిల్లలు కాస్త నిశ్శబ్దంగా కూర్చునేటట్లుగా, ఆంగ్లేయులు వచ్చాక గొడవలు తగ్గించేసారు. మ్యూటిని అప్పుడు ఆంగ్లేయులు చిచ్చు పెట్టినా.... తరువాత అది సర్దుకుంది. సరైన ప్రాతినిధ్యం లేదని అలీజిన్నా లాంటి నాయకులు కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్రం రావడం, భారతందేశంలో ముస్లింలకు న్యాయం జరగదని వారు భావించి ప్రత్యేక దేశం కావాలని అడగడం జరిగింది, ఆ తరువాతి పరిస్థితులు ఎంతో రక్తపాతానికి తెరతీసింది. తరువాత కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఇక బాబ్రి మసీద్ విషయానికి వస్తే బాబర్ ఆ మసీద్ కట్టినప్పటి నుండి అది వివాదాస్పదమే. రామజన్మ భూమి పైన ఉన్న గుడిని కూల్చి, అక్కడ మసీద్ కట్టారని వాదన ఉంది (అలాంటిది ఏమీ లేదని ముస్లింల వాదన). మ్యూటిని ముందు వరకు హిందు, ముస్లిం లు అందరూ అక్కడ పూజలు జరిపేవారు. కాని మ్యూటిని గొడవల తరువాత హిందువులను అనుమతించలేదు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఆ మసీద్ ముందే చేసేవారు. ఆ మసీద్ యొక్క ఒక భాగం లో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించినా అధికారులు అనుమతించలేదు. తరువాత జరిగిన గొడవలలో కొద్దిగా కూలిపోతే ఆంగ్లేయులు కట్టించారు. స్వాతంత్రం తరువాత 1949 లో ఒకరాత్రి కాపలా పోలిసుల కన్నుగప్పి సీతారాముల విగ్రహాలని లోపల ప్రతిష్టించారు. తరువాత హిందూ భక్తులు మసీద్ లోపలికి రావాలని ప్రయత్నించడం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆ గుడిని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేసారు. 1984 నుండి అక్కడ గుడి కట్టాలని VHP, BJP లు గొడవలు చేయడం, కోర్టు ఆదేశాలని ప్రక్కన పెట్టి 1992 లో మసీద్ కూల్చడం జరిగింది. అది ఒక విధంగా మన రాజ్యాంగాన్ని మనమే వెక్కిరించినట్టు !!! నా ఉద్దేశ్యం ప్రకారం సరైన ఆధారాలు చూపి న్యాయపరంగా సాధించుకుంటే బాగుండేది. అది ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను!!! ఈ పని వల్ల సమస్య మరింత జటిలమైంది. మతవిద్వేషాలు రగిలి ఎన్నో గొడవలకి ఆజ్యం పోసింది. ముస్లింలలో అభద్రతాభావం పెంచింది. ఇది ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొట్టి వారి సహాయంతో చెలరేగిపోతున్నారు. రామజన్మభూమి దగ్గర జరిగిన త్రవ్వకాల ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అక్కడ రామాలయం ఉందనే ఆధారాలు ఎన్ని దొరికాయో, లేవని కూడా అన్నే దొరికాయి. అసలు సంగతి రామునికే తెలియాలి !!!

మరి ఇప్పుడు ఏం చేయాలి !!!!

ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తప్పులు ఇద్దరి వైపు జరిగిపోయాయి. అన్నింటికి అవతలి వారే కారణం అని చూపెట్టుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మానెయ్యాలి.

అయోధ్యలో రాముడి గుడి గురించి ప్రస్తావన తీసుకు రాకపోవడం చాలా మంచింది. ఒకవేళ పట్టుబట్టి కట్టినా ( ఒకవేళ అక్కడ గుడి ఉందని ఋజువైతే! ) గుడికి ఎమైనా జరిగితే గోద్రా కన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అనవసరంగా దేశంలో అస్థిరత వస్తుంది. అప్పుడు ఇంకెన్ని తీవ్రవాద సంస్థలు మొదలవుతాయో.

కాశ్మీర్ విషయానికి వస్తే అది ఇచ్చే సమస్యే లేదు. కాశ్మీర్ ఇచ్చినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు, ఇంకా పెరిగినా పెరగొచ్చు. అంతే కాక అక్కడ ఉన్న 30% హిందువుల గురించి కూడా ఆలోచించాలి ( కనీసం ఈ విషయం లో నైనా మనం అన్ని దేశాలలా ఆలోచించాలి ). పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అందరికి తెలిసిందే !!. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి కన్నా భారతదేశంలో ముస్లింల పరిస్థితి బాగుందని ఖచ్చితంగా చెప్పగలను. 1989 లో కాశ్మీరీ పండిట్లకి వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టారు, స్వాతంత్రం ఇస్తే ఇంకేం చేస్తారో.

భారతదేశం ఏర్పడినప్పటి నుండి లౌకిక రాజ్యం గా ఉంటున్నాం, అది అందరూ గౌరవించాలి. ప్రభుత్వం మాదే కదా అని ' రాముడే లేడు ' అనే కాంగ్రెస్ నాయకులకి, నోరుంది కదా అని 'రాముడు పెద్ద తాగుబోతు' అనే కరుణానిధి లాంటి నాయకులకి, మెజారిటీలము కదా అని ' బాబ్రి మసీద్ గతే మీకు పడుతుంది ' అని హెచ్చరించే (సామ్నా పత్రికలో) బాల్ థాకరే లాంటి నాయకులకి ప్రజలు బుద్ది చెప్పాలి.

మన దగ్గరి సమస్యలని కేవలం ప్రాంతీయ సమస్యలు గానే చూస్తుంన్నాము, దేశ సమస్యలు గా చూడటం లేదు. మొన్నటి వరకు కాశ్మీర్ తీవ్రవాదం కేవలం కాశ్మీర్ సమస్యగానే చూసాము, కాని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం వల్ల జాతీయ సమస్య గా పరిణమించింది. మొన్న ముంబయి దాడులు జరిగిన తరువాత రోజే అస్సాం లో రైలు లో బాంబు వల్ల ముగ్గురు చనిపోయారు, ఆ విషయం గురించి పెద్దగా స్పందనే రాలేదు. కాశ్మీర్ తీవ్రవాదం అయినా, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తీవ్రవాదమైనా, దండాకారణ్యంలో మావోయిస్టులనైనా, దేశ సమస్యకు కారణం ఎవరైనా మనందరం ఒక్కటిగా ఎదురుకోవాలి. జాతీయ సమైక్యతను పెంచాలి.

ఒకవైపు అందరం ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు మన ప్రియతమ కరుణానిధి గారు LTTE వాళ్ళని రక్షించే పనిలో ఉన్నారు. ఈ విధంగా మనది ద్వంద వైఖరి అని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నమాట. శ్రీలంక ప్రజలు 'వారికి వాళ్ళ సమస్యే తీర్చుకోవడం తెలియదు, మనది తీరుస్తారా' అని నవ్వుకుంటున్నారు. మన నాయకులకు ఎప్పుడు బుద్ది వస్తుందో!!!

కొందరు ముస్లింలకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటం వల్ల అందరు ముస్లింలు ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు. అందువల్ల కొందరు హిందువులు ముస్లింలను స్నేహితులుగా చేసుకోవడం లోను, ఇల్లు అద్దెకు ఇవ్వడం లాంటి విషయాలలోను ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి విషయాలలో మార్పు రావాలి.

ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా భారతీయ ముస్లింలు వేధింపులకు గురి అవుతున్నాం అని భాధ పడుతున్నారు. ప్రశ్నించబడేది కేవలం అనుమానితులే, అది కూడా నేర పరిశోధనలో భాగంగానే తప్ప ఇస్లాం మీద ద్వేషం తో కాదని ముస్లింలు గ్రహించాలి. దానికి కారణం కూడా కొందరు భారతీయ ముస్లింలు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడిన సందర్భాలు చాలా బయటపడ్డాయి కాబట్టి.

భారతదేశంలో ముస్లింలకి సరైనా ప్రాతినిధ్యం లేదా, ఆర్ధికంగా వెనక బడ్డారా? అని అడిగితే దానికి సమాధానం అవుననే వస్తుంది. సచార్ రిపోర్ట్ లో మనం పూర్తి గణాంకాలు చూడవచ్చు. ఆ రిపోర్ట్ దాకా ఎందుకు, మనం చదివిన ప్రదేశాలలో, ఉద్యోగం చేసే చోట చూస్తే మనకే తెలుస్తుంది... వారి ప్రాతినిధ్యం ఏంతో. వారి అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ముస్లింలే కాదు మన దేశంలో కోట్ల మంది హిందువులు కూడా కటిక పేదరికం లో ఉన్నారు. దాదాపు 30% (అంటే ఒక 30 కోట్లనుకోండి !!) మంది దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్లు మత ప్రాతిపదకన కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికి ఇవ్వాలనేదే చాలా మంది కోరిక. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ యొక్క అవసరం ఎంతైనా ఉంది. పేదరికంలో మగ్గుతున్న ఎందరో అమాయకులైన ముస్లిం యువకులను తీవ్రవాదులు తమ పావులుగా వాడుకుంటుంన్నారు, ఈ విషయం లో వారిని మరింత విజ్ఞానవంతులను చెయ్యాలి. మన దేశంలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

దేశవిభజన సందర్భంలో అక్షరాస్యులైన, ధనికులైనా ముస్లింలు చాలా మంది పాకిస్థాన్ కి వెళ్ళారు, అందువల్ల ముస్లింలలో పేదవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము ( ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ). మైనారిటీలం కాబట్టే మాకు సరైనా అవకాశాలు దొరకడం లేదు అనే భావన చాలా మంది లో ఉంది, కాని అది కేవలం రాజకీయనాయకులు సృష్టి మాత్రమే, రాజకీయాలు, ఆటలు, సినిమాలలో ( చెప్పాలంటే బాలివుడ్ మొత్తం వారిదే) ముస్లింలను ఎంతో మందిని చూడవచ్చు. ఇక అజారుద్దీన్ లాంటి వారు 'మైనారిటీలమనే మా మీద వివక్ష' అని నాటకాలాడటం, మతం అడ్డం పెట్టుకొని MIM వాళ్ళు రౌడీయిజం చేయడం లాంటి వాటి వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఈ విషయాన్ని కూడా ముస్లింలు గుర్తించాలి.

అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ లింక్ దొరికింది. హిందు-ముస్లిం వివాదాలతో పాటు కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విషయాలు అవును కదా అని అనిపించాయి. ఉదాహారణకి, పోలీసులు ఉద్యోగంలో చేరక ముందు నుండి ఉన్న నమ్మకాలని (దేవుడు, మతం....) వారు మార్చుకోరు. అందువల్ల హిందు-ముస్లిం గొడవలు జరిగేప్పుడు పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో సంస్కరణలు అవసరం. ఇదే ప్రశ్న పోలీసులని అడిగితే గొడవలు జరిగేప్పుడు ఎవరు aggressive గా ఉంటే వారిని control చేయడానికి ప్రయత్నిస్తాం అంటారు.

పరిస్థితులన్ని చక్కబడి అందరూ ఒక కుటుంబంలా ఉండాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు !!!